కడప జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఎలాంటి పనులు జరగడం లేదని బాధితుడు నాగ చంద్రహాస్ రెడ్డి ఆరోపించారు. కడపకు చెందిన భూగర్భ గనుల శాఖ అధికారుల తీరును నిరసిస్తూ.. నాగ చంద్రహాస్ రెడ్డి కడప కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. లక్కిరెడ్డిపల్లి వద్ద ఉన్న గనులకు అనుమతి ఇవ్వాలని భూగర్భగనుల శాఖకు అనుమతి కోరగా.. ఇప్పటివరకు అధికారులు పట్టించుకోలేదన్నారు. లక్కిరెడ్డిపల్లె ఎమ్మార్వో దగ్గరకు వెళితే.. తనకు తెలియదని తాను రెవెన్యూ శాఖకు కొత్త అని.. ఉన్నతాధికారుల వద్దకు వెళ్లాలని సూచించారని చెప్పారు. ఆయన చెప్పిన శాఖకు వెళ్లినా.. అధికారులు పట్టించుకోలేదని తెలిపారు. పైగా రాజకీయపరంగా వెళితే పనులు జరుగుతాయని ఉచిత సలహాలు ఇస్తున్నారని పేర్కొన్నారు. తాను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదని..అయినా అధికారులు ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: గుంటూరు జైలు వద్ద ఉద్రిక్తత.. నిరసనకారుల అరెస్ట్