స్వచ్ఛత చర్యలు పాటిస్తూ- అదే స్థాయిలో వైద్యసేవలు విస్తరిస్తే కరోనా కట్టడి సాధ్యమని కడప జిల్లా యంత్రాంగం భావిస్తోంది. మంగళవారం కొత్తగా మరో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో అధికారులు దీర్ఘకాలిక చర్యలకు సిద్ధమయ్యారు. కరోనా రాష్ట్ర నోడల్ అధికారి మంగళవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఇదే అంశాన్ని ప్రస్తావించారు.
కడప జిల్లా వ్యాప్తంగా 2246 పడకల సామర్థ్యంతో 19 క్వారంటైన్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేయగా.. మంగళవారం నాటికి వీటిలో 239 మంది మాత్రమే ఉన్నారు. 66 గదులకు ప్రత్యేకంగా మరుగుదొడ్లు అందుబాటులో ఉన్నాయి. 872 గదుల్లో సాధారణ మరుగుదొడ్లు ఉన్నా.. ప్రస్తుతానికి ఇబ్బందేమీ లేదు. ఫాతిమా వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన కరోనా వైద్యశాలలో 800 నాన్- ఐసీయూ పడకల్లో 500 పూర్తిగా ఉపయోగించుకునేలా వసతులు కల్పించారు. వెంటిలేటర్లతో కూడిన ఐసీయూ పడకలు 20 ఉన్నాయి. కడప ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రతి రోజు 3 షిఫ్టుల్లో 90 నమూనాలను పరీక్షించేలా చర్యలు తీసుకున్నారు. జిల్లాలో 8 మంది వైద్యులు, ఆరుగురు నర్సులు కరోనా నివారణ సేవల్లో నిమగ్నమయ్యారు.
మరోసారి పరీక్షలు
జిల్లాలో ఇప్పటివరకు 33 మందికి కరోనా వైరస్ సోకింది. వీరిలో నలుగురు వ్యక్తులు కాకుండా మిగతా 27 మందికి జిల్లా కరోనా ఆసుపత్రిలో సేవలందిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నలుగురిని తిరుపతికి తరలించారు. జిల్లా కరోనా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పలువురు వ్యక్తులకు ప్రస్తుతం ఎలాంటి కరోనా అనుమానిత లక్షణాలు లేవని భావిస్తున్నారు. వారు ఇప్పటికే 14 రోజులు వైద్యశాలలో ఉన్నందున.. మరోసారి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు, వైద్యులు సిద్ధమయ్యారు. నెగిటివ్గా తేలితే ఇంకోసారి పరీక్షలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ 2 పరీక్షల్లోనూ నెగిటివ్ వచ్చిన వ్యక్తులను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసి క్వారంటైన కేంద్రాలకు పంపిస్తారు.
ఇవీ చదవండి: