పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, గోపాలపురం, దేవరపల్లి మండలాల్లో 5 పొగాకు వేలం కేంద్రాలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 14 వేల మంది రైతులు ఉండగా.. సుమారు 22 వేల హెక్టార్లు పొగాకు పంటలు పండిస్తున్నారు. గత నాలుగేళ్లుగా సాగులో వరుస నష్టాలు చవి చూస్తున్న పొగాకు రైతులకు.. మరో పిడుగు లాంటి ప్రమాదం వచ్చిపడింది. పండిన పంటలో పురుగు మందుల అవశేషాలు శాతం ఎక్కువగా ఉందంటూ అటువంటి పంటను అన్ని చోట్ల ప్రత్యేక క్లస్టర్లు ఏర్పాటు చేసి కొనుగోలు చేస్తామని బోర్డు అధికారులు చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కరోనా సమయం కావడంతో పొగాకు ధర అమాంతంగా పడిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏడాది సాగు చివరకి అప్పులే మిగులుతున్నాయని వాపోతున్నారు. కొత్తగా ఇప్పుడు అవశేషాలు పేరుతో పొగాకు కొనుగోలు నిలుపుదల చేయడం సరికాదన్నారు. జిల్లాలో సుమారు రెండు వేలమంది రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు.
బోర్డు అధికారులు, సీటీఆర్ఐ శాస్త్రవేత్తలు సూచించిన మేరకే రసాయన మందులను పిచికారి చేశామన్నారు. పొగాకు వేలం సగం ముగిశాక... పంటల అవశేషాలు ఏడు శాతం మించాయి అని జిల్లాలో పలు క్లస్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై స్పందించాలని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబుకు వినతి పత్రం అందించినట్లు పొగాకు రైతులు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి పొగాకు రైతుల ఆదుకో పోతే వచ్చే ఏడాది పంట విరామాన్ని ప్రకటిస్తామన్నారు.