భూముల్ని ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు కేటాయించేటప్పుడు ఎలాంటి విధానాన్ని అనుసరిస్తున్నారో తెలియచేయాలంటూ... హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ వ్యవహారంపై వాదనలు వినిపించేందుకు కోర్టు సహాయకులుగా సీనియర్ న్యాయవాది రఘురామ్ను నియమిస్తూ ఆదేశాలు ఇచ్చింది. భూ కేటాయింపులను సవాలు చేస్తూ... తరచూ వ్యాజ్యాలు కోర్టు ముందుకు వస్తున్నాయని పేర్కొంది.
ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నియమనిబంధనలతో పాటు... వేర్వేరు సందర్భాలను గుర్తించాల్సి ఉందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ యు.దుర్గాప్రసాదరావులతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. పశ్చిమగోదావరి జిల్లా వట్లూరు, భోగాపురం గ్రామాల పరిధిలో 350 ఎకరాల భూమిని... పారిశ్రామిక ప్రాంతం ఏర్పాటు చేసేందుకు ఏపీఐఐసీకి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
2016 జులైలో వెమ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఏపీఐఐసీ భూములు కేటాయించింది. ఈ అంశాన్ని సవాలు చేసిన పిటిషనర్... చెరువు ప్రాంతంగా ఉన్న ఈ భూములను కేటాయించేందుకు ప్రభుత్వానికి హక్కులు లేవని కోర్టుకు విన్నవించారు. దీనిపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం... చెరువు భూములను పరిశ్రమలకు కేటాయించటం ఏమిటని ప్రశ్నించింది. భూ కేటాయింపుల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలేమిటో తెలియచేయాలంటూ... ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై కోర్టు సహాయకుడు... అమికస్ క్యూరిని నియమిస్తూ... ఆదేశాలిచ్చింది.