పశ్చిమగోదావరి జిల్లా వెంకటాపురం గ్రామం జ్వరాలతో వణుకుతోంది. దేశమంతా కరోనాతో భయపడుతుంటే.. అక్కడ మాత్రం జ్వరం పీడిస్తోంది. ఎక్కువమందికి డెంగీగా నిర్ధరణయింది. వారంతా భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
రెండు రోజుల్లో రూ.1.75 లక్షలు
భాగం శ్రీనివాసరావు అనే రైతు ఇంట్లో ఆయనతో పాటు ఆయన భార్య శ్రీలత, కుమారుడు శశాంక్లకు జ్వరం వచ్చింది. ప్లేట్లెట్స్ పడిపోవటంతో ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిని ఆశ్రయించారు. అక్కడ 2 రోజుల్లో రూ.1.75 లక్షల బిల్లు వేశారు. దీంతో భయపడిన ఆయన భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి చికిత్స తీసుకుంటున్నారు. గ్రామానికి దగ్గరలో భద్రాచలం ఉన్నందున బాధితులు అక్కడకు వెళ్తున్నారు. అయితే కరోనా నేపథ్యంలో కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు బంద్ అయినందున.. వారంతా అక్కడి ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయించారు. సాధారణ పరిస్థితి ఉన్నవారికి అక్కడే చికిత్స చేస్తున్నారు. ప్లేట్లెట్స్ బాగా తగ్గిపోయిన వారిని మాత్రం పట్టణాలకు వెళ్లమని సూచిస్తున్నారు. అయితే వెళ్లేమార్గం లేకపోవటం, బాధితులంతా మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు కావటంతో ఈ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు.
రాకపోకలకు ఇబ్బంది
కరోనా నేపథ్యంలో ఆంధ్రా-తెలంగాణ సరిహద్దు చెక్పోస్టు వద్ద ఇబ్బందులు పడుతున్నామని బాధితులు వాపోతున్నారు. జ్వరాలతో బాధపడుతున్నామని చెప్పినా పోలీసులు తెలంగాణకు వెళ్లడానికి వీల్లేదని, జంగారెడ్డిగూడెం ఆసుపత్రులకు వెళ్లాలని సూచిస్తున్నారని తెలిపారు. భద్రాచలం తమకు 15 కి.మీ. దూరంలో ఉంటుందన్నారు. 100 కి.మీ.దూరంలో ఉన్న జంగారెడ్డిగూడెం వెళ్లి ఇబ్బందులు పడలేక భద్రాచలం వెళ్తున్నట్లు వివరించారు.
తగ్గుముఖం పట్టాయి
'వెంకటాపురంలో జ్వరాలు ఉన్నమాట వాస్తవమే. ఆ గ్రామానికి వెళ్లి పరీక్షలు జరిపాం. భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్కువమంది చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం జ్వరాలు తగ్గుముఖం పట్టాయి. గ్రామంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాం.' - జయకృష్ణ, వైద్యాధికారి, అమరవరం పీహెచ్సీ
ఇవీ చదవండి.. గుంటూరు జిల్లాలో అమల్లోకి సరి - బేసి విధానం