2011 జనగణన ప్రకారం విజయనగరం జిల్లాలో పది వేలు జనాభా దాటిన ఆరు పంచాయతీల్లో చీపురుపల్లి మేజరుపై అందరి దృష్టి పడింది. ఎస్.కోటలో సర్పంచి, ఉపసర్పంచి పదవులకు తీవ్ర పోటీ ఉంది. ఇదే పరిస్థితి కొత్తవలస, కొండపాలెం (గరివిడి)ల్లోనూ నెలకొంది. 10 వేలకు పైగా జనాభా కలిగిన పంచాయతీల ఓటర్లు ఏ పార్టీ మద్దతుదారులకు జై కొడతారోనన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది.
ఏడు వేల నుంచి 10 వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలు ఎనిమిది ఉన్నాయి. ఇందులో అంతర్జాతీయ విమానాశ్రయం రానున్న భోగాపురంపై అందరి దృష్టి పడింది. ఈ పంచాయతీ ఎస్సీ మహిళకు రిజర్వు కావడంతో ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఇక్కడ ఉపసర్పంచి పదవికీ పోటీ నెలకొంది. ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ ప్రధాన కేంద్రమైన కురుపాంలోనూ పోరు ఆసక్తికరంగా మారింది. ఇక జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న గజపతినగరం, పురిటిపెంట పంచాయతీలు కీలకంగా మారాయి.
ఎనలేని ప్రాధాన్యం
ఏడు వేలు నుంచి జనాభా దాటిన పల్లెలో సర్పంచులకు, పాలకవర్గాలకు ఎనలేని ప్రాధాన్యం ఉంటుంది. ఇవి పెద్దఎత్తున వ్యాపారాలు, చిన్నతరహా పరిశ్రమలు, మెరుగైన మౌలిక వసతులు, విద్య, వైద్య సదుపాయాలతో పట్టణాలుగా రూపాంతరం చెందుతున్నాయి. దీనికి తోడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులతో మెరుగైన పాలన, అభివృద్ధి పనులకు ఆస్కారం ఉంది. పెద్ద గ్రామాల సర్పంచులకు అన్ని ప్రభుత్వ కార్యకలాపాల్లో తొలి ప్రాధాన్యం ఉంటుంది. సార్వత్రిక ఎన్నికలను ప్రభావితం చేసే పంచాయతీలు కావడంతో.. ప్రస్తుత పోరులో అన్ని రాజకీయపక్షాల గెలుపు వ్యూహరచనలకు వేదికలుగా మారాయి.
ఇదీ చదవండి: