విజయనగరం జిల్లాలో...
మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ...విజయనగరంలోని పోస్టాఫీసు ఎదుట వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్రం తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాల వల్ల దేశంలోని రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని.. మోదీ ప్రభుత్వం వ్యవసాయరంగ చట్టాలు తెచ్చి రైతులు, ప్రజలకు తీవ్ర నష్టం తెచ్చిందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వి.కృష్ణంరాజు ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులు వ్యతిరేకిస్తున్న సాగు చట్టాలసు వెంటనే వెనక్కు తీసుకోవాలని మోదీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
గుంటూరులో జిల్లాలో...
రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలను తక్షణమే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా గుంటూరులోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. ప్రధాని నరేంద్రమోదీ రైతులను ఇబ్బందులకు గురి చేస్తూ.. కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా చట్టాలను తీసుకొచ్చారని మండిపడింది.
అనంతపురం జిల్లాలో...
బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట కేంద్రం తీసుకువచ్చిన నల్లచట్టాలను రద్దు చేయాలంటూ సీపీఎం ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేశారు. గత 22 రోజులుగా దిల్లీలో లక్షలాది మంది రైతులు రోడ్డెక్కి ఉద్యమాలు చేస్తున్నా.. కేంద్ర ప్రభుత్వానికి మాత్రం చీమ కుట్టినట్టు కూడా లేదని ఎద్దేవా చేశారు. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా రైతాంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పే పనిలో నరేంద్ర మోదీ ఉన్నారని మండిపడ్డారు. విద్యుత్ చట్టం ఆమోదం పొందితే వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు పెట్టి.. రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తారని ఆరోపించారు.
ఇదీ చదవండి: సామాన్యుల ప్రయోజనాలు కాపాడేందుకే.. భూ సర్వే: సీఎం