ప్రార్థనాలయాల భద్రతపై అవగాహన సమావేశం నిర్వహిస్తున్న పోలీసులు ప్రార్థనాలయాల్లో పోలీసు భద్రతపై విశాఖ నగర పోలీసు ఉన్నతాధికారులు విస్తృత నిఘా పెట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని నగరంలోని అన్ని పోలీసుస్టేషన్ల సిబ్బందిని ఆదేశించారు. గతంలో విగ్రహాల ధ్వంసం కేసులు నమోదైన నేపథ్యంలో అన్ని స్టేషన్ల సీఐలు వారివారి పరిధిల్లో ఉన్న ప్రతి ప్రార్థనాలయాన్ని సందర్శించి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. భద్రత పరంగా ఉన్న లోపాలను గుర్తించి నివేదికలిచ్చారు. ఏ ప్రార్థనాలయంలో ఎలాంటి భద్రత లోపం ఉందన్న విషయంపై స్పష్టత వచ్చిన నేపథ్యంలో ఆయా లోపాల్ని సరిదిద్దేందుకు ప్రార్థనాలయాల కమిటీల సభ్యులతో భేటీ అయ్యారు. వారితో అవగాహన సమావేశాలు నిర్వహించారు. లోపాల్ని సరిదిద్దాలని కమిటీలకు నోటీసులు జారీ చేసి మరీ ఆదేశించడంతో ఇప్పటికే పలు ప్రార్థనాలయాల్లో భద్రత పెరిగింది. ఆయా కార్యక్రమాల్ని రానున్న రోజుల్లో మరింత ముమ్మరం చేయాలని సీపీ మనీశ్కుమార్ సిన్హా మరోసారి ఆదేశాలు జారీ చేశారు.
* అన్ని ప్రార్థనాలయాల్లో భద్రత ఆడిట్లను నిర్వహించే కార్యక్రమాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఆయా ఆడిట్లు నిర్వహించని సంస్థలు యుద్ధప్రాతిపదికన వాటిని పూర్తిచేయాలని సూచించారు.
- పలు ప్రార్థనాలయాల్లో సీసీ కెమెరాల నిఘా పెట్టారు. కొన్నిచోట్ల భద్రత సిబ్బందిని నియమించారు. సిబ్బంది లేని చోట్ల వాలంటీర్లైనా కాపలా ఉండేలా చర్యలు తీసుకోవాలని పోలీసులు ఆలయ కమిటీలకు సూచిస్తున్నారు.
- దొంగలు ప్రవేశించడానికి అవకాశం ఉన్న మార్గాలు మూసేయించి దొంగతనాలకు ఉన్న అవకాశాల్ని తగ్గించారు. ముఖ్యంగా మద్యం తాగి ఆలయాల సమీపంలోకి వచ్చేవారి విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
- నేరచరిత్ర ఉన్నవారి కదలికలు ప్రార్థనాలయాల సమీపంలో ఏమైనా ఉంటున్నాయేమోనన్న విషయాల్ని కూడా పరిశీలించాలని ఆదేశాలు జారీ చేశారు.
- మహిళా పోలీసులు సాయం కూడా తీసుకోవాలని సూచిస్తున్నారు.
- మనీశ్కుమార్ సిన్హా, నగర పోలీసు కమిషనర్, విశాఖపట్నం