విశాఖలోని వాల్తేర్ క్లబ్ భూముల విషయంలో ప్రత్యేక దర్యాప్తు బృందం చర్యలను వారం పాటు నిలువరిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. సిట్ నోటీసును సవాలు చేస్తూ వాల్తేర్ క్లబ్ అధ్యక్షుడు ఫణీంద్రబాబు హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేయగా... హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జయసూర్య ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. 1964లోనే వాల్తేర్ క్లబ్కు సెటిల్మెంట్ పట్టా ఉందని క్లబ్ తరపు న్యాయవాది డీవీ సీతారామమూర్తి కోర్టుకు తెలిపారు. క్లబ్ ఆస్తులు పూర్తిగా ప్రైవేటు వ్యవహారం అయినందున ప్రభుత్వం పాత్రేమి ఉండదని పేర్కొన్నారు. ఇప్పటికే స్టే ఉత్తర్వులు ఉన్నందున సిట్ జోక్యం చేసుకొనేందుకు వీల్లేదన్నారు. సిట్ తరపున అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. వాల్తేర్ క్లబ్ భూములు ప్రభుత్వానివేనన్నారు. క్లబ్ లీజుకు తీసుకొందని కోర్టుకు తెలిపారు. వాదోపవాదాల అనంతరం... వాల్తేర్ క్లబ్ భూముల విషయంలో తొందరపాటు చర్యలు వద్దని న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.
ఇదీ చదవండి: విశాఖలో ఫిబ్రవరి 12నుంచి జాతీయస్థాయి కరాటే ఛాంపియన్ షిప్ పోటీలు