హోం ఐసొలేషన్లో ఉంటూ చికిత్స పొందుతున్న కొవిడ్-19 బాధితులకు ప్రభుత్వ పరంగా ఎటువంటి ఔషధాలు అందడం లేదు. కొవిడ్ కేర్ కేంద్రాల్లో వైద్యుల సూచనల ప్రకారం అవసరమైన మందులు సొంతంగా సమకూర్చుకుంటూ చికిత్స పొందుతున్నారు. స్వీయ గృహనిర్బంధం(హోం ఐసొలేషన్)లో ఉన్న బాధితులకు వివిధ రకాల ఔషధాలతో పాటు, రక్తంలో ఆక్సిజన్ శాతం తెలిపే పల్స్ఆక్సీమీటర్ వంటి పరికరాలతో కూడిన మెడికల్ కిట్ ఇవ్వనున్నామని తొలుత రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.
ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లాకు లోగడ కొన్ని కిట్లను పంపింది. విశాఖ జిల్లాకు కిట్లు వస్తాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ నుంచి సమాచారం వచ్చింది. అయితే ఇప్పటి వరకు కిట్లు రాలేదు. ‘హోం ఐసొలేషన్’ బాధితులకు ఔషధాల సరఫరాకు సంబంధించి ఎటువంటి స్పష్టత ప్రభుత్వం నుంచి రాలేదు. దీంతో స్థానికంగా ఉన్న వైద్యాధికారులు ‘హోమ్ ఐసొలేషన్’కు మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ నిబంధనలకు లోబడి కొంతమంది బాధితులకు ఇంటి వద్దే చికిత్స పొందే వెసులుబాటు కల్పిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో కొవిడ్ కేర్ కేంద్రాలు, కొవిడ్ ఆసుపత్రుల్లో 9,098 మంది చికిత్స పొందుతున్నారు.
వీరిలో 1,403 మంది ఇళ్లల్లో ఉన్నారు. వీరికి ప్రభుత్వ పరంగా ఎటువంటి ఔషధాలు అందడం లేదు. తామే మందులను కొనుగోలు చేసుకొని చికిత్స పొందుతున్నామని బాధితులు పేర్కొంటున్నారు. వీరి ఆరోగ్య స్థితి గతులపై నిరంతరం ఆయా ఇళ్లకు సమీపంలో ఉన్న ఆరోగ్య కార్యకర్తలు, ఆశాలు, ఏఎన్ఎంలు పరిశీలన చేయాలి. ప్రతీరోజూ వెళ్లి ఆరోగ్య స్థితిని తెలుసుకోవాలి. రక్తంలో ఆక్సిజన్ శాతం ఎంత ఉందో నిర్ధారించుకోవాలి. అయితే వీటిలో కొన్ని సేవలు సక్రమంగా జరగడం లేదని కొందరు బాధితులు వాపోతున్నారు.
స్వీయ గృహ నిర్బంధమిలా: ఎవరైనా హోమ్ ఐసొలేషన్ పొందాలంటే కొన్ని నిబంధనలు పాటించాలి.
- కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ తర్వాత వారి ఆరోగ్య స్థితి, వ్యాధి లక్షణాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని కొవిడ్ కేర్ కేంద్రం లేదా కొవిడ్ ఆసుపత్రికి తరలిస్తారు.
- కొవిడ్ కేర్ కేంద్రాలకు తరలించిన వారికి మాత్రమే హోం ఐసొలేషన్ ఇవ్వనున్నారు.
- బాధితుల వయసు 20 నుంచి 50 ఏళ్ల లోపు ఉండాలి.
- వ్యాధి లక్షణాలు లేకుండా కొవిడ్ నిర్ధారణ కావాలి.
- మధుమేహం, రక్తపోటు, హృద్రోగం, ఆస్తమా, కిడ్నీ వ్యాధులేవీ ఉండకూడదు.
- సొంత ఇంటిలో ప్రత్యేకంగా మరుగుదొడ్డి సదుపాయంతో కూడిన పడక గది ఉండాలి.
- మెడికల్ కిట్లు ఇంతవరకు అందుబాటులోకి రాలేదని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఆర్.తిరుపతిరావు తెలిపారు. హోం ఐసొలేషన్లో ఉన్న వారి ఆరోగ్య స్థితిపై ఎప్పటికప్పుడు పరిశీలన చేసి తదుపరి చర్యలను తీసుకుంటున్నామని ఏఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ పి.వి.సుధాకర్ తెలిపారు.
- ఇంటిలో 10 ఏళ్ల లోపు పిల్లలు, 60 ఏళ్ల పైబడిన వృద్ధులు ఉండకూడదు. ఏమాత్రం అనుమానం ఉన్నా వెంటనే 104 కాల్సెంటర్ను , టెలీమెడిసిన్ విభాగ వైద్యులను సంప్రదించాలి.
- ఇవన్నీ పాటిస్తామంటూ వ్యక్తిగత హామీ ఇచ్చే వారిని మాత్రమే కొవిడ్ కేర్ కేంద్రాల వైద్యులు హోం ఐసొలేషన్కు పంపుతున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా హోం ఐసొలేషన్లో ఉన్న వారి ఆరోగ్య స్థితిపై క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ మెరుగుపర్చాలని బాధితులు కోరుతున్నారు.
ఏడు మృతదేహాలు...మూడు రోజులుగా ఇక్కడే!
కరోనా లక్షణాలతో చికిత్సకు వచ్చి ‘విమ్స్’లో కన్నుమూసిన వారి మృతదేహాలను సంబంధీకులు తీసుకువెళ్లకపోవటం గమనార్హం. చనిపోయిన వారి వివరాలు అస్పష్టంగా ఉంటున్నాయి. ఫోన్ చేసినా కుటుంబ సభ్యులు, బంధువులు సరిగా స్పందించటం లేదు. వారి సంతకం చేయకపోతే జీవీఎంసీకి అప్పగించటం వీలు కాదు. ఫలితంగా మృతదేహాలు విమ్స్లోనే ఉండిపోతున్నాయి. గత మూడు రోజుల్లో చనిపోయిన ఏడుగురి మృతదేహాలు సోమవారం వరకూ విమ్స్లోనే ఉండిపోయాయి.
పరిస్థితులు చక్కదిద్దుతాం
సోమవారం విమ్స్కు వచ్చిన మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఇక్కడ పరిశీలించారు. వైద్యసిబ్బంది ఎంతగానో శ్రమిస్తున్నారని, వారికి అందరూ సహకరించాలని కోరారు. ఇకపై రోగులను చేర్చుకునేటప్పుడు కుటుంబసభ్యుల పూర్తి వివరాలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సోమవారం నాటికి 321 మంది కొవిడ్ రోగులు విమ్స్లో చికిత్స పొందుతున్నారని అందులో 139 మంది ఐసీయూలో ఉన్నారన్నారు. 300 మంది వైద్యులు ఉండాల్సిన చోట 80 మందే ఉన్నారని, 300 మంది నర్సులుండాల్సిన చోట 120 మందే ఉండి తీవ్రంగా శ్రమిస్తున్నారన్నారు. పరిస్థితులను చక్కదిద్దుతామని వెల్లడించారు.
- జిల్లాలో హోం ఐసొలేషన్లో చికిత్స పొందుతున్నవారు: 1,403
ఇదీ చదవండి: రాజీనామా చేస్తే 175 గెలుచుకోవచ్చు... జగన్కు రఘురామ సూచన