అనుమానాస్పదం కాని ప్రమాద మరణానికి సంబంధించి.. పోస్టుమార్టం, న్యాయవిచారణ నివేదికలు లేవంటూ క్లెయిమ్ తిరస్కరించిన బీమా సంస్థకు రాష్ట్ర వినియోగదారుల కమిషన్ అక్షింతలు వేసింది. ఏదో కారణం చెప్పి పరిహారం ఎగ్గొట్టాలని చూస్తే కుదరదని స్పష్టం చేసింది. విశాఖపట్నానికి చెందిన గుండంగట్టు రాము 2016 ఆగస్టులో ఇఫ్కో- టోకియో జనరల్ ఇన్సూరెన్సు సంస్థ నుంచి ఏడాది కాలపరిమితితో బీమా పాలసీ తీసుకున్నారు. ఏడాదిలోగా పాలసీదారు ప్రమాదవశాత్తూ మరణిస్తే నామినీకి రూ.15 లక్షల పరిహారం అందుతుంది. రోడ్డుపై వెళుతుండగా కాలు జారి డ్రైనేజీలో పడి గాయాలపాలైన రాము చికిత్స పొందుతూ 2016 అక్టోబరులో చనిపోయారు. ఆయన భార్య లక్ష్మి సంబంధిత ధ్రువపత్రాలతో బీమా పరిహారం కోసం దరఖాస్తు చేశారు. బీమా సంస్థ స్పందించకపోవడంతో లక్ష్మి విశాఖపట్నం జిల్లా వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించారు. పాలసీ అసలు కాపీని, శవపరీక్ష నివేదిక, చట్టపరమైన వారసత్వ ధ్రువపత్రాన్ని అందజేయకపోవడంతో క్లెయిమును తిరస్కరించామని బీమా సంస్థ సమాధానమిచ్చింది. సాక్ష్యాధారాలు పరిశీలించిన జిల్లా కమిషన్.. బీమా సంస్థ సేవాలోపం ఉందంటూ రూ.15 లక్షల బీమా సొమ్ముతో పాటు, ఫిర్యాదు ఖర్చులుగా రూ.25వేలు లక్ష్మికి అందజేయాలని ఆదేశించింది. దీన్ని సవాలు చేస్తూ బీమా సంస్థ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించింది. ఆధారాలను పరిశీలించిన రాష్ట్ర కమిషన్ అధ్యక్షుడు జస్టిస్ టి.సునీల్ చౌదరి, సభ్యుడు ముత్యాల నాయుడు జిల్లా కమిషన్ తీర్పును సమర్థించారు. ‘క్లెయిమ్ ఫారంలో పోస్టుమార్టం, న్యాయ విచారణ నివేదికలు అడగలేదు. ఇది అనుమానాస్పద మరణం కాదని బీమా సంస్థకు తెలిసినందునే అలా చేయలేదు. రాము చికిత్స తర్వాత ఇంటికెళ్లి చనిపోయినందున.. ఆయన మృతదేహానికి పోస్టుమార్టం జరగలేదు. అనవసరమైన నివేదికలను సాకుగా చూపి బీమా సంస్థలు క్లెయిములను తిరస్కరించలేవు’ అని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: విశాఖ ఉక్కుపై చంద్రబాబు లేఖ తెల్లకాగితం మీద సంతకమే: అంబటి