వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించి పంట నష్టం అంచనా వేసేందుకు విశాఖ జిల్లాలో రెండు రోజుల పాటు కేంద్ర బృందం పర్యటించనుంది. తడిసిన వరి ధాన్యం రంగు ఎంత మారింది..ఎంతమేర మొలకెత్తింది..తదితర అంశాలపై రైతులతో మాట్లాడి తెలుసుకోనున్నారు.
కేంద్ర పౌరసరఫరాల శాఖ పరిధిలో ఉన్న అగ్రికల్చర్ అండ్ రీసెర్చ్ సెంటర్ అసిస్టెంట్ డైరెక్టర్, హైదరాబాద్ స్టోరేజ్ అండ్ రీసెర్చ్ సెంటర్ అధికారులు పర్యటనలో పాల్గొంటారు. నేడు పాయకరావుపేట, ఎలమంచిలి, కసింకోట, అనకాపల్లి, చోడవరం, ఆనందపురం మండలాల్లో పర్యటించనున్నారు. రేపు నర్సీపట్నం, చింతపల్లితో పాటు మరికొన్ని ప్రాంతాల్లో పొలాలను పరిశీలిస్తారు.
ఇప్పటికే జిల్లాలో వివిధ పంటలకు వాటిల్లిన నష్టాన్ని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. ప్రాథమిక స్థాయిలో సుమారు 15 వేల హెక్టార్లలో వరి పంట దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. నిన్నటి వరకు సుమారు 1500 హెక్టార్లలో పంట నష్టం వివరాలు నమోదు చేసినట్లు చెప్పారు. మిగిలిన ప్రాంతాల్లో సర్వే చేసేందుకు నాలుగైదు రోజుల సమయం పడుతుందని వారు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: