శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పురపాలక పరిధిలో కరోనా కేసులు బయటపడుతున్న నేపథ్యంలో... జిల్లా కలెక్టర్ ఆదేశాలమేరకు స్థానిక కూరగాయల వర్తకాలు యధావిథిగా ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్లోనే కొనసాగించాలని మునిసిపల్ కమిషనర్ ఎం.రవిసుధాకర్ ఆదేశించారు. బుధవారం సాయంత్రం ఆయన కార్యాలయంలో వర్తకులతో సమావేశం నిర్వహించారు.
పట్టణంలోని సొట్టవానిపేట, గణేష్నగర్, ఊసావానిపేట ఇప్పటికే కంటైన్మెంట్ జోన్లుగా మారినందున ముందస్తు చర్యలలో భాగంగా కూరగాయల వర్తకాలు కాలేజీ గ్రౌండ్కు మార్చాలని సూచించారు. మాస్కులు ధరించని వారికి అమ్మకాలు చేయరాదని, వ్యాపారులు తప్పనిసరిగా హ్యాండ్ శానిటైజర్, చేతి గ్లౌజులు వాడాలని తెలిపారు. జిల్లా కేంద్రానికి ప్రధాన రైల్వే స్టేషన్ ఉన్నందున వలస కార్మికుల రాకతో కరోనా సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉన్నందున సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
మాస్కులు ధరించని వర్తకులకు, కొనుగోలుదారులకు జరిమానా తప్పదని హెచ్చరించారు. తోపుడుబండ్ల వ్యాపారులు రోజు విడిచి రోజు కంటైన్మెంట్ జోన్ల వద్ద ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
- సాధారణ వర్తకులు జాగ్రత్తలు తీసుకోవాలి
కిరాణా ఇతర సాధారణ వర్తకులు కూడా తమ వ్యాపార స్థలంలోనే చేతుల పరిశుభ్రతకు విధిగా నీరు, సబ్బు, హ్యాండ్ వాష్, శానిటైజర్ లు అందుబాటులో ఉంచాలన్నారు. వర్తకులలో ఎవరికైనా అస్వస్థతగా ఉంటే స్థానిక సీహెచ్సీలో కరోనా పరీక్షలు ఉచితంగా చేయించుకోవచ్చని తెలిపారు. మాస్కులు ధరించనివారికి అమ్మకాలు చేయరాదన్నారు. ఈ కార్యక్రమంలో వర్తక వ్యాపార ప్రతినిధులు శిల్లా మల్లి. బి.జగన్, రాజు, శ్రీను, నాయుడు తదితరులు పాల్గొన్నారు.
- ఊసావానిపేట..కంటైన్మెంట్
పట్టణ పరిధి 3వ వార్డు ఊసావానిపేటలో మహిళా వార్డు వాలంటీర్కు కరోనా పాజిటివ్గా నిర్ధరణ కావడంతో ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ ప్రాంతంగా గుర్తించామని కమిషనర్ తెలిపారు. పట్టణంలో సొట్టవానిపేట, గణేష్ నగర్లు ఇదివరకే కంటైన్మెంట్ జోన్లుగా ఉన్నాయన్నారు. ఈమేరకు బుధవారం ఊసావానిపేట గ్రామాన్ని సందర్శించారు. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతతోపాటుగా, సామాజిక దూరం పాటించాలని, పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు.
- ఎలాంటి అపోహలకు లోను కావద్దు
ఎటువంటి వదంతులు, అపోహలకు, ఆందోళనలకు తావివ్వకుండా ఉండాలని తెలిపారు. ఆయన వెంట ఏఈ అప్పలనాయుడు, ఆర్ఐ హరీష్, సచివాలయ రెవెన్యూ కార్యదర్శి చంద్రమౌళి తదితరులు ఉన్నారు.
ఇవీ చూడండి:'గ్రామ రెవెన్యూ అధికారిపై చర్యలు తీసుకోండి