10 మండలాలో ఉత్సాహంగా పోలింగ్
లావేరులో బారులుదీరిన ఓటర్లు
శ్రీకాకుళం జిల్లా టెక్కలి, పాలకొండ, శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్ పరిధిలోని కొన్ని మండలాల్లో తొలిదశలో పోలింగ్ నిర్వహించారు. నామినేషన్ల పర్వం నుంచి అభ్యర్థుల తుదిజాబితా వరకూ ఆసక్తి రేపిన ఈ ఎన్నికలు కట్టుదిట్టమైన భద్రత నడుమ సజావుగానే సాగాయి. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను అధికారులు ముందుగానే గుర్తించి ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టారు.
స్వల్ప ఘటనలు
* ఎల్.ఎన్ పేట మండలం గొట్టిపల్లి బూత్కు ఓ వ్యక్తి సహా యకుడితో వెళ్లగా ఏజెంట్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో బూత్ బయట ఇరువర్గా లు ఘర్షణకు దిగాయి.
* చాపర, పెద్దపద్మాపురం కేంద్రాల్లో పోలింగ్ కొనసాగుతుండగా విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో ప్రత్యర్థుల్లో ఆందోళన వ్యక్తమైంది.
* కొత్తూరు మండలం కుంటిభద్ర, వసప, మెట్టూరు నిర్వాసితకాలనీ, కొత్తూరు, కలిగాం, బమ్మిడి, కర్లెమ్మ నిర్వాసితకాలనీ వంటి చోట్ల పోలింగ్ కేంద్రాల వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో పోలీసులు సరిదిద్దారు.
* మర్రిపాడు-సీలో అధికారపార్టీకి చెందిన వారు పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం చేయడంతో పోలీసులు చెదరగొట్టారు.
మెళియాపుట్టి వద్ద హైదరాబాద్ నుంచి వచ్చిన వలస ఓటర్లను తీసుకెళుతున్న నాయకులు
282 సర్పంచ్, 1,666 వార్డు స్థానాలు
తొలిదశలో 321 పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 39 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 282 సర్పంచ్, 1,666 వార్డులకు పోలింగ్ నిర్వహించారు. ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకూ ఓటర్లను కేంద్రాల్లోకి అనుమతించారు. ప్రారంభంలో ఓటింగ్ మందకొడిగా సాగింది. ఒకట్రెండు మినహా మిగిలిన మండలాల్లో పెద్దగా ఓటర్లు బయటకు రాలేదు. తర్వాత ప్రతి గంటకూ పెరుగుతూ వచ్చింది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగింది. మధ్యాహ్నం 12.30 గంటలకు టెక్కలి మండలంలో అత్యల్పంగా 49 శాతం ఉండగా 2.30 గంటలకు 69 శాతం నమోదైంది. భోజన వేళకు ఓటర్లంతా పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. అన్నిచోట్లా అదే పరిస్థితి కనిపించింది. ఓటర్లు ఒక్కసారిగా చేరుకోవడంతో కేంద్రాలన్నీ కోలాహలంగా దర్శనమిచ్చాయి. పోలింగ్ ముగిసే సమయానికి 75.77 శాతం మంది ఓటుహక్కును వినియోగించుకున్నట్లు అధికారులు నిర్ధరించారు.
రాష్ట్రంలోనే తక్కువ
* వెనుకబడిన జిల్లాగా పేరున్న శ్రీకాకుళం జిల్లాలో పంచాయతీ ఎన్నికల తొలిదశ ఓటింగ్ శాతం రూపంలో మరోసారి వెనుకబడింది. విజయనగరం మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మొదటిదశ పోలింగ్ మంగళవారం జరిగింది. దానిలో జిల్లాలోనే అత్యంత తక్కువ పోలింగ్ నమోదైంది.
ఏ సమయానికి ఎంతంటే.. (శాతాల్లో)
గిరిజనుల్లోనూ ఉత్సాహం..
పంచాయతీ ఎన్నికలంటే సాధారణంగా పోలింగ్ శాతం ఎక్కువే ఉంటుంది. గత ఎన్నికల్లో జిల్లాలోని 85 శాతం మంది గ్రామీణులు తమ ఓటుహక్కును వినియోగించుకుని రాష్ట్రంలోనే మిగిలిన జిల్లాలకు ఆదర్శంగా నిలిచారు. కొత్తూరు మండలంలో కొన్ని గిరిజన గ్రామాలు ఉన్నాయి. వారు తెల్లవారుజామునే పోలింగ్ కేంద్రాలకు బయలుదేరారు. కనీసం రోడ్డు మార్గం కూడా లేని ఆయా గ్రామాల నుంచి కిలోమీటర్ల కొద్దీ కొండ కోనల్లో నడుచుకుంటూ వచ్చి ఓటేశారు. ఎప్పుడు, ఏ ఎన్నికలొచ్చినా ఈ గ్రామాల ప్రజలు తప్పకుండా వచ్చి ఓటువేసి వెళ్తారు.
ఓటు విలువ వీరికే తెలుసు..
కొత్తూరు మండలంలోని రెండు పంచాయతీల్లో ఓట్ల లెక్కింపు ఉత్కంఠంగా సాగింది. కర్లెమ్మ ఆర్అండ్ఆర్ కాలనీలో పుచ్చ అప్పారావు కేవలం 5 ఓట్ల తేడాతో ప్రత్యర్థి ఆర్.శ్రీనుపై విజయం సాధించారు. రెండుసార్లు కౌంటింగ్ నిర్వహించినా ఫలితాల్లో మార్పులేదు. నీలకంఠాపురంలో కొండాన రమణమ్మకి 311, ప్రత్యర్థి మఠం త్రివేణికి 305 ఓట్లు వచ్చాయి. మొత్తం 13 ఓట్లు చెల్లుబాటు కాలేదు. కొండాన రమణమ్మ ఆరు ఓట్ల తేడాతో విజయం సాధించారు.
వారి ప్రభావం తక్కువే
శ్రీకాకుళం జిల్లా అంటేనే వలసలకు పెట్టింది పేరు. ఇక్కడివారు దేశ నలుమూలల్లోనూ ఉన్నారు. కొవిడ్ కారణంగా విధించిన లాక్డౌన్ వల్ల వారంతా స్వగ్రామాలకు వచ్చేశారు. కరోనా తగ్గుముఖం తర్వాత తిరిగి కొత్త పనుల్లో చేరారు. మరి కొందరు ఇటీవలే సంక్రాంతి పండగకు ఇంటికి వచ్చి వెళ్లారు. ఇంతలోనే ఎన్నికలు రావడంతో మళ్లీ రావాలంటే రాలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. దూర ప్రాంతాలకు వలసలు వెళ్లిన వారు కూడా వ్యయప్రయాసలకు ఓర్చుకోలేక రాలేకపోయారు. ఫలితంగా ఎప్పుడూ పోలింగ్ శాతంలో ముందుండే జిల్లాలో ఈసారి పరిస్థితులు కొంత నిరాశపరిచాయి.
లాటరీ తగిలింది.. సర్పంచయ్యాడు
కొత్తూరు మండలానికి చెందిన మార్తాపురం పంచాయతీ నుంచి పోటీ చేసిన అభ్యర్థుల్లో ఇద్దరికి 210 చొప్పున ఓట్లు పోలయ్యాయి. రీకౌంటింగ్ చేసినా అవే ఫలితాలు వెలువడ్డాయి. దీంతో అధికారులు లాటరీ పద్ధతిని అధికారులు అనుసరించారు. ఇందులో నాస బాలకృష్ణను అదృష్టం వరించింది. సర్పంచ్ పీఠాన్ని దక్కించుకున్నారు. ప్రత్యర్థి టెక్కలి రవికుమార్పై విజయం సాధించారు.
ఇదీ చదవండి: పల్లెల్లో వెల్లివిరిసిన చైతన్యం..మొదటి విడతలో భారీ పోలింగ్