ప్రకాశం జిల్లాలో అమూల్ సంస్థ 259 రైతు భరోసా కేంద్రాల నుంచి పాల సేకరణ ప్రారంభించనుంది. ఈ ప్రక్రియ నవంబరు 25న మొదలు కానున్నట్లు రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకటించారు. డెయిరీ అభివృద్ధిపై అనుబంధ శాఖల అధికారులతో కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో సమావేశం జరిగింది.
జిల్లాలో పాల సేకరణ కేంద్రాలను ప్రారంభించడానికి అమూల్ సంస్థ బృందాలు 331 గ్రామాలలో సమగ్ర సర్వేలను నిర్వహించాయని మేనేజింగ్ డైరెక్టర్ అన్నారు. ఈ నివేదిక ప్రభుత్వానికి పంపిందన్నారు. ఇరవై ఐదు మండలాలలో ప్రయోగాత్మకంగా నవంబరు 20వ తేదీన పాల సేకరణ మొదలవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పాల ఉత్పత్తులు సేకరించడానికి 25వ తేదీన అన్ని ఏర్పాట్లు చేస్తుందన్నారు. విడతల వారీగా 820 రైతు భరోసా కేంద్రాలలో పాల సేకరణ చేపడతామన్నారు. దీనికి సంబంధించిన నగదు కేవలం 10రోజుల్లోనే రైతులకు ఆన్లైన్ ద్వారా అందిస్తామన్నారు.
అమూల్ సంస్థ భాగస్వామ్యంతో జిల్లాలో డెయిరీ అభివృద్ధి పై రాష్ట్రప్రభుత్వం దృష్టి సారించిందని కలెక్టర్ పోల భాస్కర్ చెప్పారు. జిల్లాలో ప్రస్తుతం 90 డెయిరీలు పనిచేస్తున్నాయని ఆయన తెలిపారు. గ్రామ సచివాలయాన్ని ఒక యూనిట్గా తీసుకొని డెయిరీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
ఇదీ చదవండి: వ్యాపార విజయం: భార్య ఆలోచన.. భర్త కార్యాచరణ