విద్యార్థులతో కళకళలాడుతున్న ఈ బడి... నెల్లూరులోని కురుగంటి నాగిరెడ్డి పురపాలక పాఠశాల. విద్యార్థుల తల్లిదండ్రుల నమ్మకాన్ని చూరగొన్న సర్కారు పాఠశాల ఇది. ఐదేళ్లుగా కార్పొరేట్ స్కూళ్లకు సమానంగా ఉత్తమ ఫలితాలు సాధిస్తోంది. ఏటా 1,200 నుంచి 1,400 మందికి మాత్రమే ప్రవేశాలుంటాయి. రాజకీయ నాయకుల సిఫారసులు పని చేయవనే పేరుంది. ఇలా గత ఏడాది వరకు పాఠశాల విజయవంతంగా నడిచింది. ఈ ఏడాది మాత్రం పరిస్థితి మారింది. కొందరి ఒత్తిళ్లతో పరిమితికి మించి విద్యార్థులను చేర్చుకున్నారు. పిల్లల సంఖ్య సుమారు 1700కు చేరింది. వెయ్యి మందికి సరిపడే మౌలిక సదుపాయాలు మాత్రమే ఉంటే.... దాదాపు రెట్టింపు సంఖ్యలో విద్యార్థులు చేరారు. ఫలితంగా తరగతి గదులు కిక్కిరిసిపోయాయి. విద్యార్థుల అవస్థలకు అంతే లేకుండా పోయింది.
కేఎన్ఆర్ పాఠశాలలో 14 తరగతి గదులు మాత్రమే ఉన్నాయి. నిబంధనల ప్రకారం తరగతి గదిలో 30 నుంచి 40 మంది విద్యార్థులు ఉండాలి. సంఖ్య ఎక్కువై... ఒక్కో గదిలో 80 నుంచి 100 మంది విద్యార్థులు కూర్చోవాల్సి వస్తోంది. సరిపడా డెస్కులూ లేవు. బ్లాక్ బోర్డుకు దగ్గర్లో కిందే కూర్చుని... పైకి చూస్తే కానీ మాస్టారు బోర్డుపై ఏం రాస్తున్నారో అర్థం కాదు. కళ్ళలో చాక్ పీస్ పొడి పడి... చూపు సమస్యలు వస్తున్నాయని చిన్నారులు వాపోతున్నారు. పాఠశాల ఆవరణంలోని చెట్ల కింద మరో 4 తరగతులకు పాఠాలు చెబుతున్నారు. ఎండలో కాలుతున్న బండలపైనే కూర్చుని పాఠాలు వినాలి. వానొస్తే గత్యంతరం లేక ఇళ్ళకు వెళ్లిపోతారు.
పాఠశాలలో అరకొర మౌలిక సదుపాయాలకు తోడు... శౌచాయాలలోనూ నీరు ఉండడం లేదు. ఇంకొన్ని తరగతులకు అంగన్వాడీ విద్యార్థుల భవనాన్ని వినియోగించుకుంటున్నా.. అక్కడా ఇరుకు గదుల్లో ఒకరిపై ఒకరు కూర్చోవాల్సి వస్తోంది.
పాఠశాలకు 30 తరగతి గదులుంటేనే ప్రస్తుతం ఉన్న విద్యార్థులకు సౌకర్యవంతంగా చదువు చెప్పవచ్చని ప్రధానోపాధ్యాయుడు ప్రకాశ్ రావు అంటున్నారు. రెండేళ్ల కిందట మొదలై ఆగిపోయిన భవన నిర్మాణాలను పూర్తి చేయాల్సి ఉందన్నారు.
రాష్ట్రంలోనే ఆదర్శంగా గుర్తింపు పొందిన కేఎన్నార్ ఉన్నత పాఠశాలలో... ఇలా అనేక సమస్యలతో బోధన కుంటుపడుతోంది. వీలైనంత త్వరగా కొత్త భవనాలు నిర్మించాలని విద్యార్థుల తల్లితండ్రులూ కోరుతున్నారు.
ఇదీ చదవండి