Father Killed his Daughter for Honor: నంద్యాల జిల్లా పాణ్యం మండలం ఆలమూరు గ్రామంలో.. కుటుంబం పరువు తీసిందన్న కోపంతో.. కన్న తండ్రే కుమార్తెను అత్యంత దారుణంగా హతమార్చిన ఘటన.. సంచలనంగా మారింది. గ్రామానికి చెందిన దేవేంద్రరెడ్డికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె ప్రసన్న(21) కు రెండేళ్ల క్రితం ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్తో పెళ్లి జరిగింది. వారు హైదరాబాద్లో నివాసం ఉండేవారు. పెళ్లికి ముందే ప్రసన్న మరో వ్యక్తిని ప్రేమిస్తుండేది.
అతనితో సాన్నిహిత్యం కారణంగా ఇటీవల ఆమె హైదరాబాద్ నుంచి గ్రామానికి వచ్చేసి.. తిరిగి భర్త దగ్గరకు వెళ్లలేదు. పలుమార్లు.. కాపురానికి వెళ్లాలని చెప్పినా.. కుమార్తె వినకపోవటంతో.. పరువు పోయిందని భావించిన తండ్రి కూమార్తెపై కోపం పెంచుకున్నాడు. ఈనెల 10న ఇంట్లో గొంతు నులిమి హతమార్చాడు. అనంతరం మరికొందరితో కలిసి మృతదేహాన్ని కారులో నంద్యాల- గిద్దలూరు మార్గంలో అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి.. తల, మొండెం వేరు చేసి.. తల ఒకచోట, మొండేన్ని మరోచోట పడేశారు. తిరిగొచ్చి ఏం తెలియనట్లు వ్యవహరించాడు.
కొద్దిరోజులుగా.. మనవరాలు ఫోన్ చేయకపోవడంతో తాత శివారెడ్డికి అనుమానం వచ్చింది. ప్రసన్న ఎక్కడికి వెళ్లిందని ఆరా తీశారు. దేవేంద్రరెడ్డిని గట్టిగా నిలదీయడంతో పరుపు పోయిందని కుమార్తెను చంపేసినట్లు తెలిపాడు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనెల 23న దేవేంద్రరెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రసన్న మృతదేహాన్ని పడేసిన ప్రాంతానికి తీసుకెళ్లి రెండ్రోజులు గాలించారు.
24వ తేదీన.. తల, మొండెం దొరికాయి. పోస్ట్మార్టం నిమిత్తం వాటిని నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. శనివారం పోస్టు మార్టం పూర్తి చేసి.. మృతదేహాన్ని తాత శివారెడ్డి, చెల్లెలు ప్రవళికకు అప్పగించారు. నంద్యాలలోనే అంత్యక్రియలు నిర్వహించారు.నాలుగు రోజుల క్రితం ప్రధాన నిందితుడు, ప్రసన్న తండ్రి దేవేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మృతదేహాన్ని తన కారులోనే తీసుకువెళ్లి, నల్లమల అటవీ ప్రాంతంలో పడేయటానికి సహకరించిన స్థానిక వైఎస్సార్సీపీ నాయకుడు జయన్న సహా మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నంద్యాల జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ ముఖ్యనేతకు జయన్న ముఖ్య అనుచరుడు.
ప్రజా ప్రతినిధి ఎప్పుడు పాణ్యం వచ్చినా.. ఆయన వెంటే ఈయన తిరుగుతుంటారు. తండ్రి దేవేందర్ రెడ్డి సైతం జయన్న వెంటే తిరుగుతుంటారు. వీరంతా వైఎస్సార్సీపీ నాయకులు కావటంతో.. వీరిని కాపాడేందుకు.. జిల్లా స్థాయిలో పావులు కదుపుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అందులో భాగంగానే కేసును నీరు గార్చేందుకు ప్రయత్నిస్తున్నారని.. గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. కన్న కూతురునే కడతేర్చిన తండ్రి సహా ఇతర నిందితులను కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. కేసును నిష్పక్షపాతంగా విచారించాలని కోరుతున్నారు.
"అత్యంత దారుణంగా గొంతు నొక్కి చంపేయడం జరిగింది. తరువాత అక్కడ నుంచి కారులో తీసుకెళ్లి.. తల, మొండెం వేరు చేసి లోయలో పడేయడం జరిగింది. ఈ విషయం.. ప్రసన్న తాత శివారెడ్డి ద్వారా తెలిసింది. ఆయన వచ్చి ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం". - వెంకటేశ్వరరావు, పాణ్యం సీఐ
ఇవీ చదవండి: