Kurnool ZP Chairman Resigned: కర్నూలు జడ్పీ ఛైర్మన్ మల్కిరెడ్డి సుబ్బారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను జిల్లా కలెక్టరు కోటేశ్వరరావుకు అందించారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
ఛైర్మన్ పదవి మున్నాళ్ల ముచ్చటే..
గతేడాది మార్చి నెలలో జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లో కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలానికి చెందిన ఎర్రబోతుల వెంకటరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మార్చి 15న కరోనా కారణంగా ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. కర్నూలు జడ్పీ పీఠాన్ని ఎర్రబోతులకు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అప్పటికే ప్రకటించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 2న కరోనా కారణంగా.. ఎర్రబోతుల వెంకటరెడ్డి మరణించారు. దీంతో.. వైఎస్ కుటుంబానికి ఎంతో సన్నిహితంగా ఉండే సంజామల జడ్పీటీసీ మల్కిరెడ్డి వెంకట సుబ్బారెడ్డికి ఛైర్మెన్ పదవిని కట్టబెట్టారు. సెప్టెంబర్ 25 న మల్కిరెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. బాధ్యతలు చేపట్టి కనీసం మూడు నెలలైనా కాకముందే.. ఛైర్మెన్ పదవికి మల్కిరెడ్డి సుబ్బారెడ్డి రాజీనామా చేశారు.
పాపిరెడ్డి కోసమేనా..?
వెంకటరెడ్డి మరణంతో కొలిమిగుండ్ల జడ్పీటీసీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. గత నెలలో జరిగిన ఎన్నికల్లో.. ఎర్రబోతుల వెంకటరెడ్డి కుమారుడు పాపిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎర్రబోతుల కుటుంబం నుంచి జిల్లా పరిషత్కు ప్రాతినిధ్యం ఉండటం, ఛైర్మెన్ పదవిని వెంకటరెడ్డికి ఇస్తామని గతంలో జగన్ హామీ ఇవ్వటంతో.. రాజీనామా చేయాలని మల్కిరెడ్డిపై వైకాపా అధిష్ఠానం ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్ను కలిసి రాజీనామా చేయాలని మల్కిరెడ్డి ప్రయత్నించినా.. సీఎం అపాయింట్మెంట్ లభించలేదని సమాచారం. దీంతో.. చేసేదేంలేక మల్కిరెడ్డి రాజీనామా చేసినట్లు కర్నూలు వైకాపా వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఛైర్మెన్ పీఠం ఎక్కిన 83 రోజులకే.. మల్కిరెడ్డి రాజీనామా చేయటంతో కాబోయే ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డేనని.. పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇదీ చదవండి
TDP On Amravati Maha sabha: 'అమరావతి ఐకాస సభ.. వైకాపా ప్రభుత్వ పతనానికి నాంది'