కర్నూలు జిల్లా ఆదోనిలో దాదాపు లక్షా 50 వేల ఎకరాల్లో పత్తి పంట సాగు చేస్తారు. దాదాపు 70 శాతం మంది రైతులు ఈ పంటపైనే ఆధారపడి జీవిస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల్లో అప్పు చేసి రెండు మూడుసార్లు విత్తనాలు వేసి భారీగా పెట్టుబడులు పెట్టారు. కానీ రైతులకు ఈ ఏడాది నష్టమే మిగిలింది. ఒకప్పుడు ఎకరాకు 14 క్వింటాళ్ల వరకు పత్తి దిగుబడి వచ్చేది. ఇప్పుడు ఎకరాకు మూడు నాలుగు క్వింటాళ్లు మాత్రమే వస్తుందని రైతులు వాపోతున్నారు.
ఆదోని మార్కెట్యార్డ్లో ప్రతి రోజు 10 నుంచి 15 వేల క్వింటాళ్ల పత్తి విక్రయాలు జరుగుతాయి. దళారులు నాణ్యత లోపం ఉందని క్వింటాల్ రూ.4వేల లోపే కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. అధికారులు మాత్రం గరిష్ట ధర రూ.5200 పలుకుతుందని చెబుతున్నారు. ఒకటి,రెండు పత్తి చెక్కులకు మంచి ధర వస్తుంది. మిగత పత్తి చెక్కులకు ధర రూ.3 వేల నుంచి రూ.4వేల లోపే ఇస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పత్తి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: ఎమ్మిగనూరులో రూ.70 లక్షల పత్తి విత్తనాలు స్వాధీనం