వ్యవసాయశాఖ, సీసీఐ సమన్వయ లోపం కర్నూలు జిల్లా ఆదోని పత్తి రైతులకు శాపంగా మారింది. ఈ - క్రాప్ బుకింగ్ వివరాలు వెబ్సైట్లో కనిపించడం లేదని సీసీఐ చెబుతోంది. ఈ క్రాప్ బుకింగ్ చేసినట్లు రైతుల పేరిట వ్యవసాయ శాఖ ఇచ్చన ధ్రువీకరణ పత్రాలను సీసీఐ నిర్వాహకులు తిరస్కరిస్తున్నారు.
రాష్ట్రంలో పత్తిసాగులో జిల్లా మొదటి స్థానం
కర్నూలు జిల్లాలో 2 లక్షల 60 వేల ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేస్తారు. రాష్ట్రంలో పత్తిసాగులో జిల్లా మొదటి స్థానంలో ఉంది. మద్దతు ధర రూ. 5,550 కాగా బహిరంగ మార్కెట్లో 3వేల నుంచి 4,500 వేలు పలుకుతోంది. ఫలితంగా.. క్వింటాలుకు వెయ్యి నుంచి రూ.2వేల వరకు రైతులు నష్టపోతున్నారు. గత నెల 2న సీసీఐ కొనుగోలు ప్రారంభించింది. ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో కేవలం 250 మంది నుంచి 4500 క్వింటాల పంటనే కొనుగోలు చేశారు.
ఈ - క్రాప్ ధ్రువీకరణ పత్రం ఇస్తున్నా పంట వెనక్కే!
సాంకేతిక సమస్యను సాకుగా చూపి రైతులతో ఆడుకుంటున్నాయి వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలు, సీసీఐ. పేరు నమోదు కోసం సీసీఐ కేంద్రం చుట్టూ రైతులు రోజూ తిరుగుతున్నారు. ఆన్లైన్లో ఈ -క్రాప్ నమోదు కాలేదని... వెనక్కి పంపించేస్తున్నారు. ఈ క్రాప్ బుకింగ్ చేసినట్లు వ్యవసాయ శాఖ ఇచ్చిన పత్రం చూపించినా తిరస్కరిస్తున్నారు.
ఆదుకోండి!
అధికారులు స్పందించి ఈ క్రాప్ నమోదు సమస్య పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. నిబంధనల్లో మార్పు చేసి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
ఇదీచూడండి.మళ్లీ పెరుగుతున్న ఉల్లి ధర.. ఎందుకంటే.!