కృష్ణా జిల్లా విజయవాడ రూరల్ ప్రసాదంపాడు గ్రామ పంచాయతీని ఏకగ్రీవం చేయటంపై.. ఎస్ఈసీకి ఓ అభ్యర్థి ఫిర్యాదు చేశారు. తన నామినేషన్ను అధికారులు అక్రమంగా తిరస్కరించారని ఎస్ఈసీకి.. సర్పంచ్ అభ్యర్థిని మురపాక పద్మావతి ఫిర్యాదు చేశారు.
కార్పొరేషన్లో పారిశుద్ధ్య కార్మికురాలిగా రోజువారీ కూలీగా విధులు నిర్వర్తిస్తున్న.. తనను ఉద్యోగిగా తప్పుగా చూపించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను ప్రభుత్వ ఉద్యోగి అని చెప్పి అధికారులు నామినేషన్ తిరస్కరించారని ఎస్ఈసీ ముందు వాపోయారు. రోజువారీ కూలీ చేసుకునే తాను.. ప్రభుత్వ ఉద్యోగి ఎలా అవుతానని పద్మావతి ఆవేదన వ్యక్తం చేశారు.
అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతోనే... అధికారులు ఏకగ్రీవం చేశారని వారు ఆరోపించారు. పంచాయతీని ఏకగ్రీవం చేసేందుకు ప్రత్యర్థుల నామినేషన్లు తిరస్కరిస్తున్నారని ఆరోపించారు. బలవంతపు ఏకగ్రీవాన్ని పునఃపరిశీలించి తమకు న్యాయం చేయాలని ఎస్ఈసీని కోరారు.
ఇదీ చదవండి: తాళ్లచెరువు పంచాయతీ ఏకగ్రీవానికి ప్రయత్నాలు.. రంగంలోకి దిగిన ప్రవాసాంధ్రుడు