కరోనా పరీక్షలను వేగవంతం చేయాలని సీపీఎం నేత సీహెచ్ బాబూరావు డిమాండ్ చేశారు. విజయవాడ శాంతినగర్, కండ్రిక 61, 64 డివిజన్లలో ఆయన పర్యటించారు. పాజిటివ్ కేసులు పెరుగుతుండగా... కరోనా పరీక్షలు తగ్గుతున్నాయని చెప్పారు. పాజిటివ్ కేసులు వచ్చిన కుటుంబసభ్యులకు పరీక్షలు చేయటంలేదనీ ఆరోపించారు. ఆ ప్రాంతంలోని ప్రజలు కోరుతున్నా సరే పరీక్షలు చేయకుండా కాలయాపన చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. శాంపిల్స్ సేకరించినా... తుదినివేదికలు రావటంలో జాప్యం జరుగుతుందన్నారు. అవసరమైన వారిని క్వారంటైన్కు పంపిచడం లేదని ఆరోపించారు.
చనిపోయిన వారికి కరోనా పరీక్షలు చేయటంలో జాప్యం జరగడం వల్ల బాధిత కుటుంబసభ్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. రెడ్జోన్ ఏరియాలో మరణించిన వారి దహన సంస్కారాలకు భౌతికకాయాన్ని అందించడానికి అధికారులు నిరాకరిస్తున్నారని చెప్పారు. రెడ్జోన్ ప్రాంతాల్లో చనిపోయిన వారికి అంత్యక్రియలు చేయడానికి వాహనాలు, సిబ్బంది ఏర్పాట్లు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.