గుంటూరు జీజీహెచ్లో కొంతమంది సిబ్బంది డబ్బులు వసూలు చేశారని.. రవికుమార్ అనే రోగి ఆరోపించారు. జీజీహెచ్ 103 వార్డులో 16 రోజుల క్రితం చేరగా.. మెరుగైన వైద్యం కోసం మూడు రోజుల కిందట ఐసీయూకి మార్చారని వీడియోలో తెలిపారు. అక్కడి నుంచి శనివారం రాత్రి డిశ్ఛార్జ్ చేసి అత్యవసర విభాగానికి వెళ్తే నాన్ కొవిడ్ వార్డులో చేర్చుకుంటారని సిబ్బంది చెప్పినట్లు రవికుమార్ వెల్లడించారు. తీరా అక్కడికి వెళ్తే ఆక్సిజన్ శాతం తక్కువగా ఉంటే ఎలా డిశ్ఛార్జ్ చేశారంటూ ప్రశ్నించారని.. పడకలు లేవు, కిందే పడుకోమన్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులను ప్రాధేయపడగా 303 వార్డులో చేర్చుకున్నారని చెప్పారు.
ఐసీయూ నుంచి అత్యవసర విభాగానికి తీసుకెళ్లేందుకు నాలుగో తరగతి ఉద్యోగులు డబ్బులు వసూలు చేశారని.. అక్కడి నుంచి వార్డుకు మార్చేందుకు మళ్లీ డబ్బు ఇవ్వాల్సి వచ్చిందని బాధితుడు వీడియోలో ఆరోపించారు. ఆస్పత్రిలో జరుగుతోన్న దోపిడీని బయట ప్రపంచానికి చేరవేసేందుకు వీడియో తీసినట్లు రవికుమార్ చెప్పారు. ఈ ఫిర్యాదుపై జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి స్పందిస్తూ విచారణ చేపట్టనున్నామని చెప్పారు. రోగిని తరలించేందుకు డబ్బు తీసుకున్న వారిని గుర్తించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: సీఎంకు రఘురామ నాలుగో లేఖ.. 'ఉద్యోగాల భర్తీ క్యాలెండర్'పై నిలదీత