గుంటూరు జిల్లా నగరం మండలం కట్టవ గ్రామంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నంబూరు వీరయ్య అనే వ్యక్తి ఇంటికి నిప్పు అంటుకోని ఒక్కసారిగా మంటలు వ్యాప్తించాయి. పక్కనే ఉన్న మరో 13 ఇళ్లకు మంటలు అంటుకున్నాయి. మంటలను గమనించి ఇళ్లల్లో నివసిస్తున్న వారు బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. ప్రమాదంలో 14 పూరిల్లు పూర్తిగా కాలిపోయాయి. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అగ్నిమాపక అధికారులు తెలిపారు.
సుమారు 20 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని బాధితులు చెబుతున్నారు. ఉన్న గూడు మంటల్లో కాలిపోవడంతో బాధితులు కన్నీరుమున్నీరు విలపిస్తున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకొంటున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు...ప్రమాదానికి గల కారణాల గురించి దర్యాప్తు చేస్తున్నారు. బాధితులకు తక్షణ సాయంగా రెవెన్యూ అధికారులు..20 కిలోల బియ్యం, 5 వేల నగదు ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: రుణాన్ని చెల్లించలేక వ్యక్తి ఆత్మహత్యాయత్నం