ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జంట ఆత్మహత్యకు యత్నించింది. వీరిలో భర్త చనిపోగా, భార్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాద ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని ఉండవల్లి గుహల సమీపంలోని కొండపై మంగళ వారం చోటుచేసుకుంది. సీఐ సుబ్రహ్మణ్యం కథనం మేరకు... ప్రకాశం జిల్లా హనుమంతులపాడు మండలంలోని చిన్న ముప్పాళ్లపాడు గ్రామానికి చెందిన వెండి దండి పృథ్వీ(25) హైదరాబాద్ లోని జవహర్ నగరి వాసి షేక్ పర్హనా(20) మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో శీతల పానియాలతో ఉండవల్లి గుహల సమీపంలోని కొండపైకి వెళ్లారు.
అక్కడున్న కొందరు బాలలు చూసి తల్లిదండ్రులకు తెలిపారు. జంట ఎంత సేపటికి కిందికి రాకపోవడంతో అనుమానంతో స్థానికులు కొండపైకి వెళ్లగా నోటి నుంచి నురగలు కక్కుతూ ఇద్దరు పడి ఉండటం చూశారు. వెంటనే 108 వాహన సిబ్బందికి సమాచారం ఇచ్చి ఇద్దరిని లేపడానికి ప్రయత్నించారు. అప్పటికే పృథ్వీ చనిపోయినట్లు గ్రహించారు. యువతి అపకస్మారక స్థితిలో ఉండటంతో స్థానికులు ఆమెను కొండ పై నుంచి మోసుకొచ్చి అంబులెన్స్లో విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. అంతకుముందే సమాచారంతో ఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు మృతుడి జేబులో ఫోన్ నంబర్, ఆధార్, ఓటరు గుర్తింపు కార్డుల సాయంతో చిన్నముప్పాళ్ల పాడులోని అతని తండ్రి గోపాల్రెడ్డికి విషయం చేరవేశారు. కొంత కాలం క్రితం తెనాలి, విజయవాడ ప్రాంతాల్లో పృథ్వీ పండ్ల వ్యాపారం చేశారు.
ఇటీవల హైదరాబాద్ వెళ్లిన అతను జవహర్ నగర్ లో అదే వ్యాపారం మెుదలు పెట్టారు. అక్కడే పర్హానాను ప్రేమించాడు. ఈ ఏడాది జనవరిలో ఇద్దరూ కలిసి వెళ్లిపోయారు. మరో వైపు ఆమె తల్లి దండ్రులు అక్కడి పోలిస్ స్టేషన్ తమ కూతురు కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం చిన్నముళ్లపాడులోని తండ్రికి ఫోన్ చేసిన పృథ్వీ తాము ప్రేమించి పెళ్లి చేసుకున్నానని, కోడలును ఇంటికి తెస్తున్నానని చెప్పారు. దీనిపై తండ్రి ఆందోళన వ్యక్తం చేశారు. మనది పల్లె అని, ఆమెను తెస్తే తలవంపులుగా ఉంటుందని కుమారుడికి నచ్చచెప్పేందుకు యత్నించారు. ఇది జరిగిన రెండు గంటల తర్వాత కొడుకు చనిపోయినట్లు తెలుకొని గొపాల్ రెడ్డి బోరున విలపించారు. మరోవైపు పృథ్వీతో ఫర్హనా వెళ్ళినట్లు గుర్తించిన ఆమె బంధువులు చిన్న ముప్పాళ్లపాడు చేరుకుని ఆరా తీశారు. ఇంతలోనే ఇద్దరు ఆత్మహత్యకు యత్నించారని, పృథ్వీ మృతి చెందాడని తెలుసుకొని తీవ్ర ఆందోళన చెందారు. అమ్మాయి కాళ్లకు మెట్టెలు ఉన్నాయని, ఇరువురూ పెళ్లి చేసుకున్నట్లు భావిస్తున్నామని వారి బంధువులు వస్తే కాని పూర్తి వివరాలు తెలియరావని సీఐ సుబ్రహ్మణ్యం వివరించారు.
మృతదేహాన్ని మోసుకొచ్చిన ఎస్సైలు..
పృథ్వీ మృతదేహన్ని కొండపై నుంచి తెచ్చేవారు ఎవరూ లేకపోవడంతో ఎస్సైలు నారాయణ, వినోద్ కుమార్ స్వయంగా తామే తెల్లని వస్త్రంలో చుట్టి కర్రకు కట్టుకుని కిందకు మోసుకొచ్చారు. వారికి కానిస్టేబులు సహకారం అందించారు.
ఇదీ చదవండి: పల్లెల్లో వెల్లివిరిసిన చైతన్యం..మొదటి విడతలో భారీ పోలింగ్