YSR LAW NESTAM FUNDS RELEASED : పేదలకు న్యాయం చేసేలా లాయర్లు పని చేయాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. వరుసగా నాలుగో ఏడాది వైఎస్ఆర్ లా నేస్తం నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బటన్ నొక్కి నిధులను సీఎం వైఎస్ జగన్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో లా సెక్రటరీ సత్య ప్రభాకరరావు, బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రగిరి విష్ణువర్ధన్, ఇతర ఉన్నతాధికారులు, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.
వారి కోసమే వైఎస్ఆర్ లా నేస్తం: రాష్ట్ర వ్యాప్తంగా 2 వేల 11 మంది అర్హులైన జూనియర్ న్యాయవాదులకు నెలకు 5 వేల రూపాయల చొప్పున మొత్తం రూ. 1 కోటి 55వేల నిధులను వారి ఖాతాల్లో జమ చేశారు. న్యాయవాద వృత్తిని ఎంచుకుని.. రాజ్యాంగాన్ని, చట్టాన్ని చదువుకుని న్యాయవాదులుగా స్థిరపడటానికి తొలి మూడేళ్లు ఇబ్బందులు ఉన్నాయని పలువురు న్యాయవాదులు పాదయాత్రలో తన దృష్టికి తెచ్చారని.. వారి కోసమే వైఎస్ఆర్ లా నేస్తం పథకాన్ని అమలు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా న్యాయవాదులకు ప్రభుత్వం తోడుగా ఉందన్న సంకేతాన్ని పంపుతున్నట్లు తెలిపారు.
జూనియర్ న్యాయవాదులంతా వారి వృత్తిలో స్థిరపడి వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. న్యాయవాదులకు ప్రభుత్వం తోడుగా నిలబడటం వల్ల డబ్బు లేని పేదవాడికి సహాయం చేయగలుగుతారనే విశ్వాసం ఉందన్నారు. పేదవాడికి సాయం చేయాలనే ఆలోచన న్యాయవాదుల్లో రావాలనే ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.
"కొత్తగా లా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన యువ లాయర్లకు ఆర్థికసాయం. వృత్తిలో నిలదొక్కుకునేందుకు మూడేళ్ల పాటు ఆర్థికసాయం. యువ లాయర్లకు నెలకు రూ.5 వేలు చొప్పున ఆర్థికసాయం. ప్రతి పథకంలో అర్హులైన ప్రతిఒక్కరికి లబ్ధి చేకూరుస్తున్నాం. పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాం"- వైఎస్ జగన్, ముఖ్యమంత్రి
రెండు దఫాలుగా లా నేస్తం నిధులు విడుదల: వైఎస్ఆర్ లా నేస్తం పథకం ద్వారా మూడున్నరేళ్లలో 4వేల 248 మందికి లబ్ధి చేకూర్చినట్లు సీఎం తెలిపారు. ప్రస్తుతం 2011 మంది అర్హులైన జూనియర్ న్యాయవాదులు ఈ పథకంలో కొనసాగుతున్నారన్నారు. పథకంలో కొన్ని మార్పులు తీసుకువచ్చామన్న సీఎం.. ఆరు నెలలకు ఒకసారి, సంవత్సరానికి రెండు దఫాలుగా నిధులు విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
న్యాయవాదుల సంక్షేమం కోసం రూ.100 కోట్లతో లాయర్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసినట్లు సీఎం తెలిపారు. దీని కోసం లా సెక్రటరీకి నేరుగా దరఖాస్తు చేసుకోవడంతో పాటు ఆన్లైన్లో లా సెక్రటరీ మెయిల్ ఐడీకి కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. sec_law@ap.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. లా నేస్తం పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు.. దీని కోసం ysrlawnestham.ap.gov.in వెబ్సైట్లో దరఖాస్తును అప్లోడ్ చేసుకోవచ్చని సూచించారు.
దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు పరిశీలించి శాచ్యురేషన్ విధానంలో ఏ ఒక్కరూ తప్పిపోకుండా సాయం అందిస్తామన్నారు. పేదవాడి పట్ల న్యాయవాదులు అంకితభావం చూపాలని సీఎం సూచించారు. న్యాయవాది చేతిలో ఉన్న ఆయుధం.. సైనికుడి చేతిలో ఉన్న తుపాకీ వంటిదని.. హంతకుడు చేతిలో ఉండే బాకు లాంటిది కాదన్నారు. పథకం ద్వారా ప్రభుత్వం చేస్తున్న మంచిని పొందుతున్న వారంతా పేదవాడికి సాయం చేయాలని సీఎం కోరారు.
ఇవీ చదవండి: