రాష్ట్రంలో లాక్డౌన్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పలు స్వచ్చంద సంస్థలు ముందుకొచ్చి ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ... ప్రజలకు చేయూత నిస్తున్నారు.
వాహన చోదకులను భోజన ప్యాకెట్లు పంపిణీ
దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రల సరిహద్దులు మూతపడ్డాయి. అత్యవసర సరుకుల రవాణా వాహనాల రాకపోకలు మాత్రమే సాగుతున్నాయి. అయితే లాక్డౌన్ కారణంగా జాతీయ రహదారి వెంబడి అన్ని హోటళ్లు మూతపడ్డాయి. ఫలితంగా వాహన చోదకులు భోజనాల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పలమనేరు పోలీసులు వారి ఇబ్బందులను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. స్థానిక లారీ అసోసియేషన్ సహకారంతో గంగవరం మండలంలోని ఆంధ్ర-కర్ణాటక సరిహద్దు చెక్పోస్ట్ వద్ద పలమనేరు డీఎస్పీ ఆరిఫుల్లా ఆధ్వర్యంలో లారీ చోదకులకు భోజన ప్యాకెట్లను పంపిణీ చేసే కార్యక్రమం ప్రారంభించారు. లాక్డౌన్ అమలులో ఉన్న అన్ని రోజులు కార్యక్రమాన్ని కొనసాగిస్తామని గంగవరం పోలీసులు తెలిపారు.
పోలీస్ సిబ్బందికి మాస్క్లు, గ్లౌజులు అందజేత
కరోనా వైరస్ నుంచి ప్రజలను అప్రమత్తం చేస్తూ 24 గంటల పాటు విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి కాకినాడ ఓడరేవు చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ కేవీ.రావు అభినందనలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 50,000 మంది పోలీస్ సిబ్బందికి కరోనా వైరస్ నుంచి రక్షణలో భాగంగా రూ.30 లక్షల విలువైన సామాగ్రి లక్ష మాస్క్లు, లక్ష గ్లౌజ్లు, వ్యక్తి గత రక్షణ దుస్తులను డీజీపీ గౌతమ్ సవాంగ్కి ఆయన అందజేశారు. ఈ సందర్భంగా డీజీపీ పోలీస్ సిబ్బంది మరింత బాధ్యతతో సమర్థవంతంగా ప్రజాసేవకు పునరంకితం అవ్వాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇంటింటికి కూరగాయల పంపిణీ
తూర్పుగోదావరి జిల్లా గంగనాపల్లి స్వామి నగర్లో అంబేడ్కర్ యువజన సంఘం ఇంటింటికీ కూరగాయలు పంపిణీ చేశారు. సుమారు 1000 కుటుంబాలకు కూరగాయలు సరఫరా చేసినట్లు వారు తెలిపారు.
చిన్నారుల చేయూత
తమ పుట్టినరోజు కోసం దాచుకున్న డబ్బును కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఇద్దరు పిల్లలు ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు. రూ.2000 నగదును ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డికి ఇచ్చారు. సాయి శ్రేష్ఠ, శేష పాణి అనే పిల్లలు ఈ ఏడాది తమ పుట్టిన రోజును చేసుకోమని చెప్పారు. కరోనా కారణంగా తీసుకున్న నిర్ణయంపై ఎమ్మెల్యే పిల్లలను అభినందించారు.
పశువులను ఆహారం అందజేత
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించటంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఫలితంగా దుకాణాలు... రైతు బజార్లు మూతపడ్డాయి. ఇటువంటి పరిస్థితుల్లో రోడ్లపై తిరిగే పశువులు ఆహారం దొరక్క అల్లాడుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా తునిలో ఈ పరిస్థితి గమనించిన వైకాపా నాయకుడు దాడిశెట్టి శ్రీనివాస్ పశువులకు మూడు పూటలా ఆహారాన్ని అందిస్తూ మానవత్వాన్ని చాటుతున్నారు.
పోలీసులకు భోజనం ప్యాకెట్ల అందజేత
కడప జిల్లా ప్రొద్దుటూరులో మానవత స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని పోలీసులకు 300 ఆహార పొట్లాలను అందించారు. కరోనా నేపథ్యంలో ప్రజలకు సేవలు అందిస్తున్న సందర్భంగా పోలీసులకు ఆహారాన్ని అందజేశారు. వచ్చేనెల 14 వరకూ ప్రతిరోజూ వంద మందికి ఆహారం అందజేయనున్నట్లు ఆ సంస్థ నిర్వాహకులు తెలిపారు. పట్టణంలోని వాజ్పేయ్ నగర్లో ఉన్న వృద్ధులు, నిరాశ్రయులకు డీఎస్పీ ఆహారం అందజేశారు.