ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరు అనంతపురం జిల్లా. ఇక్కడ రెండు బలమైన వర్గాలైన... పరిటాల రవి, జేసీ దివాకర్ రెడ్డి కుటుంబాలను రాజకీయంగా ఏకం చేయడంలో తెదేపా అధినాయకత్వం మంత్రాంగం పని చేసింది. నిప్పు, ఉప్పులా ఉండే జేసీ, పరిటాల వర్గీయులు ఇప్పుడు ఒకే పార్టీలో ఎవరి పని వారు చేసుకుంటున్నారు. ఇదే కొనసాగాలని ఇప్పుడు రెండు వర్గాలూ కోరుకుంటున్నాయి. ప్రకాశం జిల్లాలో కరణం, గొట్టిపాటి వర్గీయుల మధ్య వైరాన్ని తగ్గించడంలో తెదేపా విజయం సాధించింది. తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్న గొట్టిపాటి రవికుమార్ను, కరణం బలరాంను వ్యక్తిగతంగా పిలిచి చర్చించి రాజీ కుదిర్చారు.
కర్నూలు జిల్లాలో కోట్ల, కేఈ కుటుంబాల మధ్య తరాలుగా ఉన్న అంతరం అందరికీ తెలిసిందే. పార్టీలకు అతీతంగా రాజకీయంగా ఆ ఇరు కుటుంబాల వారు ఎప్పుడూ కలహించుకుంటూనే ఉంటారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కోట్ల, కేఈ కుటుంబాలు కలిసి ప్రచారం చేసుకుంటున్నాయి. కడప జిల్లాలో రామ సుబ్బారెడ్డి – ఆది నారాయణ రెడ్డి, పుత్తా నరసింహారెడ్డి – వీరశివారెడ్డి వర్గాల మధ్య నవరాజకీయంతో రాజీ కుదిరింది.
కృష్ణా జిల్లాలోని దేవినేని, వంగవీటి కుటుంబాల వైరం ఏళ్ల నాటిది. వారు కలుస్తారనే ఆలోచనే ఎవరికి రాదు. ఇప్పుడు వారు కలిసి పనిచేస్తున్నారు. వంగవీటి రంగా తనయుడు రాధాకృష్ణ తెలుగుదేశంలోకి రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. వర్గ పోరులో తీవ్రంగా నష్టపోయిన ఇరు కుటుంబాలు ఒకే పార్టీలోకి చేరి భవిష్యత్ రాజకీయాలకు పునాదులు వేసుకుంటున్నారు.