రాష్ట్ర సచివాలయంలోని గ్రామ సెక్రటరీల నియామకంపై సమన్వయ శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం సమావేశం నిర్వహించారు. గ్రామ సచివాలయ వ్యవస్థను అత్యంత సమర్థవంతంగా కార్యకలాపాలు నిర్వహించేలా సంబంధిత శాఖలు పకడ్బందీ ప్రణాళికలను అమలు చేయాలని పేర్కొన్నారు. గ్రామ కార్యదర్శుల నియామక ప్రక్రియలను ఆయా శాఖల మార్గదర్శకాలకు, నియమ నిబంధనలకు అనుగుణంగా చేపట్టాలని సీఎస్ స్పష్టం చేశారు.
అక్టోబర్ 2 నాటికి ప్రక్రియ పూర్తి..
ఆయా శాఖల ద్వారా సిబ్బందికి అందజేయాల్సిన శిక్షణను అందించేందుకు తగిన ప్రణాళికలను రూపుదిద్దాలన్నారు. నూతనంగా ఎంపిక కాబడుతున్న గ్రామ సెక్రటరీ కార్యాలయ ఉద్యోగులకు తగిన విధంగా విధులను కేటాయించడంతో పాటు వాటి పర్యవేక్షణకు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో ఎంపికయ్యే గ్రామ సచివాలయ ఉద్యోగులు ఆయా మండలాల పరిధికి అనుగుణంగా గ్రామాల్లో విధులను నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు. 2000 మంది జనాభా పరిధిలో గ్రామ సెక్రటరీ 10 శాఖలకు సంబంధించి విధులను నిర్వర్తించడం జరుగుతుందన్నారు. మొత్తం ప్రక్రియ పూర్తి చేసి అక్టోబర్ 2, 2019 నాటికి ఆయా ఉద్యోగులు విధుల్లో చేరాల్సి ఉంటుందన్నారు.
18,037 గ్రామాల పరిధిలో సచివాలయాలు..
ముందుగా 5000 జనాభాకు ఒక గ్రామ సచివాలయం ఉండాలని ప్రతిపాదించినా... ప్రభుత్వం నూతనంగా చేసిన సూచనల మేరకు ప్రతి 2000 జనాభాకు ఒక గ్రామ సచివాలయం ఏర్పాటు దిశలో భాగంగా 18,037 గ్రామాల పరిధిలో సచివాలయాలను ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని పంచాయతీరాజ్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది వివరించారు.
గ్రామ సచివాలయ పరిధిలోని గ్రామ ప్రజలకు అవసరమైన కనీస సేవల నేపథ్యంలో వ్యవసాయం అనుబంధ రంగాలు, పశు సంవర్థక శాఖ, వైద్య ఆరోగ్యం, త్రాగునీరు, పరిశుభ్రత, సామాజిక భద్రత ఫించన్లతో పాటు ఇతర అంశాలకు సంబంధించి విధులు నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు . జులై నుండి సెప్టెంబర్ లోగా మొత్తం ప్రక్రియను పూర్తి చేసి నియామక పత్రాలను అందజేయాలని ప్రతిపాదించామన్నారు. ఎంపికైన అభ్యర్థులకు సెప్టెంబర్ నెలలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఆయా గ్రామాలకు ఎంపికైన అభ్యర్థులకు సెప్టెంబర్ నెలాఖరుకల్లా నియామక ఉత్తర్వులు అందించాలన్నారు.