ముంబయిలోని వాంఖడే స్టేడియంలో దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ నిలువెత్తు విగ్రాహం ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో తన విగ్రహాన్ని పెట్టే స్థలాన్ని పరిశీలించేందుకు.. మాస్టర్ బ్లాస్టర్ భార్య అంజలితో కలిసి మంగళవారం వాంఖడే స్టేడియాన్ని సందర్శించాడు. అనంతరం విగ్రహాం ఏర్పాటు చేసే స్థలంపైన తుది నిర్ణయం తీసుకోనున్నాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సచిన్ తెందుల్కర్.. "ప్లెజెంట్ సర్ప్రైజ్.. నా కెరీర్ ఇక్కడే మొదలైంది. నా కెరీర్ అద్భుతమైన జ్ఞాపకాలతో సాగింది. 2011లో వరల్డ్ కప్ ఇక్కడే గెలిచాం. అదే నా కెరీర్లో బెస్ట్ మూమెంట్." అని వివరించాడు. సచిన్ తెందుల్కర్తో ముంబయి క్రికెట్ అసోషియేషన్ అధ్యక్షుడు అమోల్ కాలే కూడా ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
కాగా, ఏప్రిల్ 24న సచిన్ 50వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. దీనికి ఒక్క రోజు ముందు వాంఖడె సచిన్కు అత్యంత ఇష్టమైన వాంఖడే స్టేడియంలో అతడి నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ముంబయి క్రికెట్ అసోషియేషన్ భావిస్తోంది. దానికి సచిన్ కూడా అంగీకారం తెలిపారు. ఇది వాంఖడే స్టేడియంలో పెడుతున్న తొలి విగ్రహమని అధికారులు తెలిపారు. ఇది వరేకే ఈ స్టేడియంలో ఓ స్టాండ్కు సచిన్ పేరు పెట్టామని నిర్వాహకులు పేర్కొన్నారు.
కాలే మాట్లాడతూ.. "సచిన్ భారత రత్న అందుకున్న క్రీడాకారుడు. క్రికెట్కు అతడు అందించిన సేవలు అందరికీ తెలుసు. అతడు ఇప్పుడు 50వ పడిలోకి అడుగుపెడుతున్నాడు. అందుకే ఉడతా భక్తిగా ఆయన్ను ఇలా గౌరవించాలని అనుకున్నాం. కొన్ని వారాల క్రితం ఇదే మాటను సచిన్కు చెప్పి, విగ్రహం ఏర్పాటు చేసేలా ఒప్పించాం." అని కాలే వెల్లడించారు.
ఇకపోతే సచిన్ తెందుల్కర్ ఇప్పటి వరకు 200 టెస్టులు, 463 వన్డేలు ఆడాడు. ఇక క్రికెట్ చరిత్రలో 100 అంతర్జాతీయ సెంచరీలు పూర్తి చేసిన ఏకైక ఆటగాడిగా కూడా రికార్డు సృష్టించాడు. ఇవే కాకుండా మాస్టర్ బ్లాస్టర్ ఎన్నో ఘనతనలను సాధించాడు. అవి ఇప్పటికే ఎవరూ బ్రేక్ చేయలేదు. అందుకే ఈ లిటిల్ మాస్టర్ను అందరూ 'గాడ్ ఆఫ్ క్రికెట్ ' అని అభివర్ణిస్తారు.
ఇవీ చదవండి : టెస్టు క్రికెట్లో అరుదైన ఘనత.. ఒక్క పరుగు తేడాతో గెలిచిన న్యూజిలాండ్