IPL 2022: ఆస్ట్రేలియా మాజీ ఆల్రౌండర్ షేన్ వాట్సన్ను సహాయక కోచ్గా నియమిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది దిల్లీ క్యాపిటల్స్. ఈ మేరకు.. "ఐపీఎల్ లెజెండ్, టీ20 అత్యుత్తమ ఆల్రౌండర్కు స్వాగతం" అంటూ మంగళవారం ట్వీట్ చేసింది. ప్రస్తుతం దిల్లీ జట్టుకు ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు రిక్కీ పాంటింగ్ ప్రధాన కోచ్గా ఉన్నాడు. ప్రవీన్ ఆమ్రే, అగార్కర్ సహాయ కోచ్లుగా.. జేమ్స్ హోప్స్ బౌలింగ్ కోచ్గా వ్యవహరిస్తున్నారు. తన నియామకం పట్ల వాట్సన్ హర్షం వ్యక్తంచేశాడు.
"ఐపీఎల్.. ప్రపంచంలోనే ఉత్తమ టీ20 టోర్నమెంట్. ఇందులో ఆటగాడిగా నాకు అద్భుతమైన జ్ఞాపకాలున్నాయి. 2008 తొలి ఐపీఎల్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టులో సభ్యుడిగా.. షేన్ వార్న్ నాయకత్వంలో ఆడాను. ఆ తర్వాత ఆర్సీబీ, చెన్నై జట్లకు ఆడాను. ప్రస్తుతం కోచ్గా దిగ్గజ ఆటగాడు రిక్కీ పాంటింగ్ ఆధ్వర్యంలో పనిచేసే అవకాశం వచ్చింది. అతడు అద్భుతమైన నాయకుడు. ప్రపంచంలోనే అత్యుత్తమ కోచ్లలో ఒకడు. అతడి సారథ్యంలో పనిచేసేందుకు సంతోషిస్తున్నాను."
-షేన్ వాట్సన్, ఆసీస్ మాజీ క్రికెటర్
బలమైన జట్టుతో బరిలోకి..
ఈ సీజన్లో దిల్లీకి రిషభ్ పంత్ సారథ్యం వహించనున్నాడు. అతడిపై భారీ అంచనాలే ఉన్నాయి. జట్టులో డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, రోవ్మన్ పొవెల్, మిషెల్ మార్ష్ వంటి హిట్టర్లు ఉన్నారు. బౌలింగ్ విభాగంలో అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, అన్రిచ్ నోర్జ్ వంటి వారితో జట్టు పటిష్ఠంగా కనబడుతోంది.
ఇదీ చదవండి: IPL 2022: ఐపీఎల్లో 'మెయిడిన్ మాస్టర్స్' వీళ్లే.