ETV Bharat / lifestyle

Black fungus: బ్లాక్‌ ఫంగస్‌ ఎలా ప్రవేశిస్తుంది? ఎవరిలో ఎక్కువ ముప్పు?

author img

By

Published : Jun 19, 2021, 8:55 AM IST

కొవిడ్‌ మానవాళిని ఎంత వణికించిందో.. ఇప్పుడు మ్యూకర్‌ మైకోసిస్‌ (బ్లాక్‌ ఫంగస్‌) కూడా అంతే స్థాయిలో భయపెడుతోంది. గత ఏడాదిన్నర కాలంలో కరోనా జనాన్ని కుదేలు చేయగా, బ్లాక్‌ ఫంగస్‌ కేవలం మూడు నెలల కాలంలోనే ప్రజల్లోకి చొచ్చుకెళ్లింది. నెల కిందటితో పోల్చితే మ్యూకర్‌ మైకోసిస్‌ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గినా.. ప్రజల్లో దీనిపట్ల ఆందోళన మాత్రం తగ్గలేదు. కొవిడ్‌ నుంచి కోలుకున్నవారిలో ఏ మాత్రం తలనొప్పి, ముక్కు నొప్పి, కళ్లు ఎర్రబడడం వంటి లక్షణాలు కనిపించినా.. బాధితులు వెంటనే ఈఎన్‌టీ, కంటి వైద్యనిపుణుల వద్దకు పరుగులు పెడుతున్నారు. బ్లాక్‌ ఫంగస్‌ను తొలిదశలోనే గుర్తించడం వల్ల చాలా వరకు మందులతోనే నయం చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొవిడ్‌ సోకిన అనంతరం మధుమేహం నియంత్రణలో లేనివారు మరికొంత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. కొవిడ్‌ బాధితుల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతోన్న బ్లాక్‌ ఫంగస్‌పై ప్రత్యేక కథనం..

how black fungus enters into body
how black fungus enters into body

సాధారణంగా గాలి మన శరీరంలోకి ప్రవేశిస్తున్నప్పుడు ముక్కులో వడబోత ప్రక్రియ జరుగుతుంది. బ్యాక్టీరియా, వైరస్‌, ఫంగస్‌లను ఒక రకమైన జిగురు పదార్థంతో అడ్డుకుంటుంది. అక్కడ అతుక్కునేలా చేసి నెమ్మదిగా పొట్టలోకి చేరుస్తుంది. ప్రమాదకరమైన ఈ సూక్ష్మక్రిములు ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటుంది. రోగ నిరోధక శక్తి తగ్గిన వారి ముక్కులో సూక్ష్మక్రిములను అడ్డుకునే శక్తి కూడా తగ్గుతుంది. ఇటువంటి సందర్భాల్లో ఫంగస్‌ విత్తనాలు చర్మానికి అతుక్కొని వృద్ధి చెందుతాయి. అక్కడి నుంచి చర్మం లోనికి చొచ్చుకెళ్తాయి.

ఫంగస్‌ విత్తనాలు ప్రవేశించేది ఇలా..

.

1. ముక్కు లోపల ‘మిడిల్‌ టర్బినేట్‌’ అనే భాగం ఉంటుంది. మనం పీల్చే గాలి ముందుగా ఆ ప్రదేశాన్ని తాకుతూ లోనికి వెళ్తుంది. ఫంగస్‌ విత్తనాలు ‘మిడిల్‌ టర్బినేట్‌’ ప్రాంతంలో ఎక్కువగా చేరతాయి. రోగ నిరోధక శక్తి తగ్గగానే..ఫంగస్‌ విత్తనాలు మొలకెత్తి, చర్మంలోనికి చొచ్చుకెళ్తాయి.

.

2. కొందరికి దీర్ఘకాలిక సైనసైటిస్‌ సమస్య ఉంటుంది. వీరిలో సైనస్‌ లోపల నీటి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. వీటిలో ఫంగస్‌ విత్తనం చేరితే తేలిగ్గా మొలకెత్తి సైనస్‌ నుంచి పక్కనే ఉన్న ఇతర భాగాలకు పాకుతుంది. మిడిల్‌ టర్బినేట్‌ నుంచి సైనస్‌కు.. ఇక్కడి నుంచి కంటికి లేదా మెదడుకు వెళ్తుంది. ఒకవేళ ‘మ్యాగ్జలరీ సైనస్‌’కు అంటే ముక్కుకు అటూ ఇటూగా ఉండే సైనస్‌లకు సోకితే, ఎక్కువ భాగం పైదవడ ఎముకకు పాకుతుంది. తక్కువ శాతం కంటికి పాకుతుంది. ఒక్కసారి కంటికి పాకితే.. తేలిగ్గా మెదడుకు వెళ్తుంది. మెదడులో ఫంగస్‌ను నిరోధించడానికి రోగ నిరోధక వ్యవస్థ ప్రత్యేకంగా లేదు. అందుకే మెదడుకు ఇన్‌ఫెక్షన్‌ సోకడం చాలా ప్రమాదకరం. ఈ దశలో దాదాపు 80 శాతం వరకూ ప్రాణాపాయం ఉంటుంది.

ఎవరిలో ఎక్కువ ముప్పు?

  • షుగర్‌ నియంత్రణలో లేనివారు
  • అవయవ మార్పిడి చేయించుకున్నవారు
  • క్యాన్సర్‌, హెచ్‌ఐవీ, హెపటైటిస్‌-సి రోగులు
  • కొవిడ్‌ నుంచి కోలుకున్నవారు
  • స్టెరాయిడ్‌ ఔషధాలను మోతాదుకు మించి వాడినవారు

కొవిడ్‌ బాధితుల్లో ఎందుకు ఎక్కువ?

.

కొవిడ్‌ వైరస్‌ వల్ల కొందరికి రక్తంలో చక్కెర స్థాయులు పెరుగుతాయి. వీరికి స్టెరాయిడ్స్‌ ఇవ్వడం వల్ల మరింతగా షుగర్‌ పెరుగుతుంది. అప్పటికే మధుమేహ రోగులైతే రక్తంలో చక్కెర స్థాయులు రెట్టింపవుతాయి. ఫలితంగా కొవిడ్‌ నుంచి కోలుకుంటున్న వారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. కొన్ని ఆసుపత్రుల్లో అపరిశుభ్ర వాతావరణం ఉండవచ్చు. ఉదాహరణకు ప్రాణవాయువును ఇవ్వాల్సిన క్రమంలో తేమగా ఉండేందుకు ‘హ్యుమిడిఫయర్స్‌’ను వినియోగిస్తారు. వీటిని ఎప్పటికప్పుడు మార్చకపోతే ఫంగస్‌ ముక్కు ద్వారా లోనికి ప్రవేశించే అవకాశం ఉంటుంది.

లక్షణాలను గుర్తించడమెలా?

  • ముక్కులో ఫంగస్‌ ఉన్నప్పుడు.. అక్కడ నొప్పి, కొంత చికాకు, జలుబు ఉన్నట్లుగా అనిపిస్తుంది.
.
  • సైనస్‌కు వెళ్లినప్పుడు.. తీవ్రమైన తలనొప్పి, ముఖంపై నొప్పి
  • దవడ ఎముకకు సోకినప్పుడు పంటి నొప్పి, దవడ వాపు
  • ముఖంపై చర్మానికి పాకినప్పుడు అక్కడ వాపు, నొప్పి
.

కంటికి వ్యాప్తి చెందినప్పుడు.. ముందుగా కన్నునొప్పి, తర్వాత కంటి వాపు, కళ్ల నుంచి నీరు కారడం, కన్ను ఎర్రబడడం, ఒకే వస్తువు రెండుగా కనిపించడం, నెమ్మదిగా చూపు మందగించడం, పైకనురెప్పను పైకి ఎత్తలేకపోవడం
వీటన్నింటికీ ఉమ్మడిగా ఉండే లక్షణం.. భరించలేనంత నొప్పి.

బలహీన జన్యువులున్న వారిలోనూ..

- డాక్టర్‌ కాసు ప్రసాదరెడ్డి, నేత్ర వైద్యనిపుణులు, మ్యాక్సివిజన్‌ ఆసుపత్రి

కొవిడ్‌కు ముందు కూడా బ్లాక్‌ ఫంగస్‌ కేసులు మన దేశంలోనే ఎక్కువ. రోగ నిరోధక శక్తి బాగా ఉన్నవారిని ఇదేమీ చేయలేదు. అది తగ్గితే దాడి చేస్తుంది. కొవిడ్‌ తర్వాత ఈ కేసులు బాగా పెరిగాయి. షుగర్‌ వల్ల మ్యూకర్‌ మైకోసిస్‌ బారినపడే వారు సుమారు 51 శాతం మంది ఉంటే..ఎటువంటి అనారోగ్య సమస్యల్లేని వారిలో ఇది సోకేవారు సుమారు 26 శాతం మంది. వారిలో బలహీనమైన జన్యువులు ఉండడమే కారణం. ఫంగస్‌ కంటికి పాకినప్పుడు కన్ను ఉబ్బుతుంది. రెప్ప వాలిపోతుంది. కనుగుడ్డు కదలదు. బయటకు నెట్టుకొస్తున్నట్లుగా ఉంటుంది. ఈ లక్షణాలను త్వరగా గుర్తిస్తే ఆపరేషన్‌ అవసరం లేకుండా మందులతోనే తగ్గించవచ్చు. ఫంగస్‌ ఎక్కువగా వ్యాపిస్తే ప్రతి కణజాలాన్ని తీసేయాల్సిందే. కంటికి వ్యాపిస్తే కన్ను తొలగించాల్సి వస్తుంది. రోజుకు 30-40 మంది అనుమానితులు ఆసుపత్రులకు వస్తున్నా.. ఇందులో ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే బ్లాక్‌ ఫంగస్‌ బాధితులుంటున్నారు.

యాంటీ ఫంగల్‌ మందులు వాడాలి

- డాక్టర్‌ కేఆర్‌ మేఘనాథ్‌, ఈఎన్‌టీ వైద్యనిపుణులు, మా ఈఎన్‌టీ హాస్పిటల్‌

మొక్క.. అమీబా.. జంతువు.. ఏదైనా సరే చనిపోయిన తర్వాత వాటిని తినేసేది ఫంగసే. మనిషి ఒంట్లో రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉన్నప్పుడు ఫంగస్‌ ఏమీ చేయదు. మన ముక్కులోనూ ఫంగస్‌ విత్తనాలు ఉంటాయి. అది వృద్ధి చెందకుండా రోగ నిరోధక వ్యవస్థ పనిచేస్తుంది. అది సన్నగిల్లినప్పుడు ఫంగస్‌ ప్రభావం చూపిస్తుంది. ఇది శరీరంపై ఉంటుంది. గాల్లోనూ ఉంటుంది. రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడగానే.. మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. కొవిడ్‌ సోకి తగ్గిన ఆరు వారాల్లోపు మ్యూకర్‌ మైకోసిస్‌ బయటపడవచ్చు. రక్తనాళాల ద్వారా ఫంగస్‌ వ్యాప్తి చెందుతుంది. ముందుగా రక్తప్రవాహ మార్గాన్ని మూసేస్తుంది. దీంతో రక్తప్రసరణ ఆగిపోతుంది. ఆ ప్రదేశం చచ్చుబడిపోతుంది. అనంతరం ఆ మృత ప్రదేశాన్ని ఫంగస్‌ తినేస్తుంది. అలా క్రమేణా పక్కభాగాలకు వ్యాపిస్తుంది. ఆయా ప్రదేశాల్లో కంటికి కనిపించే ఫంగస్‌ భాగాలను శస్త్రచికిత్స ద్వారా తీసేయాలి. ఆ తర్వాత మిగిలిన ఫంగస్‌ విత్తనాలను మొలకెత్తకుండానే మందుల ద్వారా నిర్మూలించాలి. యాంటీ ఫంగల్‌ ఔషధాలను కనీసం ఆరు నెలల వరకూ వాడాలి.

మెదడుకు సోకితే శస్త్రచికిత్స కష్టం

- డాక్టర్‌ రంగనాథం, న్యూరో సర్జన్‌, సన్‌షైన్‌ హాస్పిటల్‌

మ్యూకర్‌ మైకోసిస్‌ చాలా ప్రమాదకరమైంది. శరీరంలో బలంగా ఉండే ఎముకలను కూడా తినేస్తుంది. ముక్కుకు 1.5 సెం.మీ. దూరంలో కంటి ఎముక ఉంటుంది. ముక్కు నుంచి 2.5 సెం.మీ. దూరంలో మెదడు ఎముక ఉంటుంది. ఈ స్థాయిలో నియంత్రించకపోతే.. ఫంగస్‌ దీన్ని కూడా తొలిచేసి మెదడులోకి ప్రవేశిస్తుంది. ఏ ప్రదేశంలో బ్లాక్‌ ఫంగస్‌ ఉన్నా దాన్ని మొత్తం తీసేస్తారు. మెదడులో అలా కాదు. ఇతర ప్రదేశాల్లో శస్త్రచికిత్స చేసినట్లుగా మెదడులో చేయడం సాధ్యం కాదు. ఫంగస్‌ పరిమాణం బాగా ఎక్కువగా ఉన్నప్పుడు తప్పని పరిస్థితుల్లో ఆపరేషన్‌ చేయొచ్చు. ఇటువంటివి చాలా తక్కువ. మెదడులో ఫంగస్‌ను తొలగించినా.. అత్యధిక సందర్భాల్లో మరింత ప్రమాదకరంగా మారుతుంది. అందుకే సాధ్యమైనంత వరకూ మెదడుకు ఫంగస్‌ చేరినప్పుడు ఔషధాలను మాత్రమే వాడాలి. వీటివల్ల మూత్రపిండాలపై దుష్ప్రభావం ఉంటుంది. అందుకే వాటి పనితీరును పరిశీలిస్తూ ఔషధాలను వినియోగించాలి.

శస్త్రచికిత్సతో రూపం సరి

- డాక్టర్‌ మణికుమారి, ప్లాస్టిక్‌ సర్జన్‌, ఈఎస్‌ఐ వైద్యకళాశాల

బ్లాక్‌ ఫంగస్‌ సోకిన అవయవాలను పూర్తిగా తొలగించిన అనంతరం రోగి కోలుకున్న తర్వాత సాధారణ రూపం తీసుకురావడంలో ప్లాస్టిక్‌ సర్జరీ పాత్ర కీలకం. ఉదాహరణకు కనుగుడ్డును తీసేస్తే ఆ గుంతను పూడ్చాలి. దవడ ఎముకను తొలగిస్తే తిరిగి నిర్మించాలి. ఫంగస్‌ తినేసిన కణజాలాన్ని మళ్లీ నిర్మించాలి. శరీరంలోని ఇతర ప్రదేశాల నుంచి కండరాన్ని, చర్మాన్ని తీసుకొచ్చి అతికించాల్సి ఉంటుంది.

ఇదీ చూడండి:

ప్రత్యేక హోదా: 'పదేపదే అడగడం తప్ప చేసేదేమీ లేదు'

సాధారణంగా గాలి మన శరీరంలోకి ప్రవేశిస్తున్నప్పుడు ముక్కులో వడబోత ప్రక్రియ జరుగుతుంది. బ్యాక్టీరియా, వైరస్‌, ఫంగస్‌లను ఒక రకమైన జిగురు పదార్థంతో అడ్డుకుంటుంది. అక్కడ అతుక్కునేలా చేసి నెమ్మదిగా పొట్టలోకి చేరుస్తుంది. ప్రమాదకరమైన ఈ సూక్ష్మక్రిములు ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటుంది. రోగ నిరోధక శక్తి తగ్గిన వారి ముక్కులో సూక్ష్మక్రిములను అడ్డుకునే శక్తి కూడా తగ్గుతుంది. ఇటువంటి సందర్భాల్లో ఫంగస్‌ విత్తనాలు చర్మానికి అతుక్కొని వృద్ధి చెందుతాయి. అక్కడి నుంచి చర్మం లోనికి చొచ్చుకెళ్తాయి.

ఫంగస్‌ విత్తనాలు ప్రవేశించేది ఇలా..

.

1. ముక్కు లోపల ‘మిడిల్‌ టర్బినేట్‌’ అనే భాగం ఉంటుంది. మనం పీల్చే గాలి ముందుగా ఆ ప్రదేశాన్ని తాకుతూ లోనికి వెళ్తుంది. ఫంగస్‌ విత్తనాలు ‘మిడిల్‌ టర్బినేట్‌’ ప్రాంతంలో ఎక్కువగా చేరతాయి. రోగ నిరోధక శక్తి తగ్గగానే..ఫంగస్‌ విత్తనాలు మొలకెత్తి, చర్మంలోనికి చొచ్చుకెళ్తాయి.

.

2. కొందరికి దీర్ఘకాలిక సైనసైటిస్‌ సమస్య ఉంటుంది. వీరిలో సైనస్‌ లోపల నీటి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. వీటిలో ఫంగస్‌ విత్తనం చేరితే తేలిగ్గా మొలకెత్తి సైనస్‌ నుంచి పక్కనే ఉన్న ఇతర భాగాలకు పాకుతుంది. మిడిల్‌ టర్బినేట్‌ నుంచి సైనస్‌కు.. ఇక్కడి నుంచి కంటికి లేదా మెదడుకు వెళ్తుంది. ఒకవేళ ‘మ్యాగ్జలరీ సైనస్‌’కు అంటే ముక్కుకు అటూ ఇటూగా ఉండే సైనస్‌లకు సోకితే, ఎక్కువ భాగం పైదవడ ఎముకకు పాకుతుంది. తక్కువ శాతం కంటికి పాకుతుంది. ఒక్కసారి కంటికి పాకితే.. తేలిగ్గా మెదడుకు వెళ్తుంది. మెదడులో ఫంగస్‌ను నిరోధించడానికి రోగ నిరోధక వ్యవస్థ ప్రత్యేకంగా లేదు. అందుకే మెదడుకు ఇన్‌ఫెక్షన్‌ సోకడం చాలా ప్రమాదకరం. ఈ దశలో దాదాపు 80 శాతం వరకూ ప్రాణాపాయం ఉంటుంది.

ఎవరిలో ఎక్కువ ముప్పు?

  • షుగర్‌ నియంత్రణలో లేనివారు
  • అవయవ మార్పిడి చేయించుకున్నవారు
  • క్యాన్సర్‌, హెచ్‌ఐవీ, హెపటైటిస్‌-సి రోగులు
  • కొవిడ్‌ నుంచి కోలుకున్నవారు
  • స్టెరాయిడ్‌ ఔషధాలను మోతాదుకు మించి వాడినవారు

కొవిడ్‌ బాధితుల్లో ఎందుకు ఎక్కువ?

.

కొవిడ్‌ వైరస్‌ వల్ల కొందరికి రక్తంలో చక్కెర స్థాయులు పెరుగుతాయి. వీరికి స్టెరాయిడ్స్‌ ఇవ్వడం వల్ల మరింతగా షుగర్‌ పెరుగుతుంది. అప్పటికే మధుమేహ రోగులైతే రక్తంలో చక్కెర స్థాయులు రెట్టింపవుతాయి. ఫలితంగా కొవిడ్‌ నుంచి కోలుకుంటున్న వారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. కొన్ని ఆసుపత్రుల్లో అపరిశుభ్ర వాతావరణం ఉండవచ్చు. ఉదాహరణకు ప్రాణవాయువును ఇవ్వాల్సిన క్రమంలో తేమగా ఉండేందుకు ‘హ్యుమిడిఫయర్స్‌’ను వినియోగిస్తారు. వీటిని ఎప్పటికప్పుడు మార్చకపోతే ఫంగస్‌ ముక్కు ద్వారా లోనికి ప్రవేశించే అవకాశం ఉంటుంది.

లక్షణాలను గుర్తించడమెలా?

  • ముక్కులో ఫంగస్‌ ఉన్నప్పుడు.. అక్కడ నొప్పి, కొంత చికాకు, జలుబు ఉన్నట్లుగా అనిపిస్తుంది.
.
  • సైనస్‌కు వెళ్లినప్పుడు.. తీవ్రమైన తలనొప్పి, ముఖంపై నొప్పి
  • దవడ ఎముకకు సోకినప్పుడు పంటి నొప్పి, దవడ వాపు
  • ముఖంపై చర్మానికి పాకినప్పుడు అక్కడ వాపు, నొప్పి
.

కంటికి వ్యాప్తి చెందినప్పుడు.. ముందుగా కన్నునొప్పి, తర్వాత కంటి వాపు, కళ్ల నుంచి నీరు కారడం, కన్ను ఎర్రబడడం, ఒకే వస్తువు రెండుగా కనిపించడం, నెమ్మదిగా చూపు మందగించడం, పైకనురెప్పను పైకి ఎత్తలేకపోవడం
వీటన్నింటికీ ఉమ్మడిగా ఉండే లక్షణం.. భరించలేనంత నొప్పి.

బలహీన జన్యువులున్న వారిలోనూ..

- డాక్టర్‌ కాసు ప్రసాదరెడ్డి, నేత్ర వైద్యనిపుణులు, మ్యాక్సివిజన్‌ ఆసుపత్రి

కొవిడ్‌కు ముందు కూడా బ్లాక్‌ ఫంగస్‌ కేసులు మన దేశంలోనే ఎక్కువ. రోగ నిరోధక శక్తి బాగా ఉన్నవారిని ఇదేమీ చేయలేదు. అది తగ్గితే దాడి చేస్తుంది. కొవిడ్‌ తర్వాత ఈ కేసులు బాగా పెరిగాయి. షుగర్‌ వల్ల మ్యూకర్‌ మైకోసిస్‌ బారినపడే వారు సుమారు 51 శాతం మంది ఉంటే..ఎటువంటి అనారోగ్య సమస్యల్లేని వారిలో ఇది సోకేవారు సుమారు 26 శాతం మంది. వారిలో బలహీనమైన జన్యువులు ఉండడమే కారణం. ఫంగస్‌ కంటికి పాకినప్పుడు కన్ను ఉబ్బుతుంది. రెప్ప వాలిపోతుంది. కనుగుడ్డు కదలదు. బయటకు నెట్టుకొస్తున్నట్లుగా ఉంటుంది. ఈ లక్షణాలను త్వరగా గుర్తిస్తే ఆపరేషన్‌ అవసరం లేకుండా మందులతోనే తగ్గించవచ్చు. ఫంగస్‌ ఎక్కువగా వ్యాపిస్తే ప్రతి కణజాలాన్ని తీసేయాల్సిందే. కంటికి వ్యాపిస్తే కన్ను తొలగించాల్సి వస్తుంది. రోజుకు 30-40 మంది అనుమానితులు ఆసుపత్రులకు వస్తున్నా.. ఇందులో ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే బ్లాక్‌ ఫంగస్‌ బాధితులుంటున్నారు.

యాంటీ ఫంగల్‌ మందులు వాడాలి

- డాక్టర్‌ కేఆర్‌ మేఘనాథ్‌, ఈఎన్‌టీ వైద్యనిపుణులు, మా ఈఎన్‌టీ హాస్పిటల్‌

మొక్క.. అమీబా.. జంతువు.. ఏదైనా సరే చనిపోయిన తర్వాత వాటిని తినేసేది ఫంగసే. మనిషి ఒంట్లో రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉన్నప్పుడు ఫంగస్‌ ఏమీ చేయదు. మన ముక్కులోనూ ఫంగస్‌ విత్తనాలు ఉంటాయి. అది వృద్ధి చెందకుండా రోగ నిరోధక వ్యవస్థ పనిచేస్తుంది. అది సన్నగిల్లినప్పుడు ఫంగస్‌ ప్రభావం చూపిస్తుంది. ఇది శరీరంపై ఉంటుంది. గాల్లోనూ ఉంటుంది. రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడగానే.. మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. కొవిడ్‌ సోకి తగ్గిన ఆరు వారాల్లోపు మ్యూకర్‌ మైకోసిస్‌ బయటపడవచ్చు. రక్తనాళాల ద్వారా ఫంగస్‌ వ్యాప్తి చెందుతుంది. ముందుగా రక్తప్రవాహ మార్గాన్ని మూసేస్తుంది. దీంతో రక్తప్రసరణ ఆగిపోతుంది. ఆ ప్రదేశం చచ్చుబడిపోతుంది. అనంతరం ఆ మృత ప్రదేశాన్ని ఫంగస్‌ తినేస్తుంది. అలా క్రమేణా పక్కభాగాలకు వ్యాపిస్తుంది. ఆయా ప్రదేశాల్లో కంటికి కనిపించే ఫంగస్‌ భాగాలను శస్త్రచికిత్స ద్వారా తీసేయాలి. ఆ తర్వాత మిగిలిన ఫంగస్‌ విత్తనాలను మొలకెత్తకుండానే మందుల ద్వారా నిర్మూలించాలి. యాంటీ ఫంగల్‌ ఔషధాలను కనీసం ఆరు నెలల వరకూ వాడాలి.

మెదడుకు సోకితే శస్త్రచికిత్స కష్టం

- డాక్టర్‌ రంగనాథం, న్యూరో సర్జన్‌, సన్‌షైన్‌ హాస్పిటల్‌

మ్యూకర్‌ మైకోసిస్‌ చాలా ప్రమాదకరమైంది. శరీరంలో బలంగా ఉండే ఎముకలను కూడా తినేస్తుంది. ముక్కుకు 1.5 సెం.మీ. దూరంలో కంటి ఎముక ఉంటుంది. ముక్కు నుంచి 2.5 సెం.మీ. దూరంలో మెదడు ఎముక ఉంటుంది. ఈ స్థాయిలో నియంత్రించకపోతే.. ఫంగస్‌ దీన్ని కూడా తొలిచేసి మెదడులోకి ప్రవేశిస్తుంది. ఏ ప్రదేశంలో బ్లాక్‌ ఫంగస్‌ ఉన్నా దాన్ని మొత్తం తీసేస్తారు. మెదడులో అలా కాదు. ఇతర ప్రదేశాల్లో శస్త్రచికిత్స చేసినట్లుగా మెదడులో చేయడం సాధ్యం కాదు. ఫంగస్‌ పరిమాణం బాగా ఎక్కువగా ఉన్నప్పుడు తప్పని పరిస్థితుల్లో ఆపరేషన్‌ చేయొచ్చు. ఇటువంటివి చాలా తక్కువ. మెదడులో ఫంగస్‌ను తొలగించినా.. అత్యధిక సందర్భాల్లో మరింత ప్రమాదకరంగా మారుతుంది. అందుకే సాధ్యమైనంత వరకూ మెదడుకు ఫంగస్‌ చేరినప్పుడు ఔషధాలను మాత్రమే వాడాలి. వీటివల్ల మూత్రపిండాలపై దుష్ప్రభావం ఉంటుంది. అందుకే వాటి పనితీరును పరిశీలిస్తూ ఔషధాలను వినియోగించాలి.

శస్త్రచికిత్సతో రూపం సరి

- డాక్టర్‌ మణికుమారి, ప్లాస్టిక్‌ సర్జన్‌, ఈఎస్‌ఐ వైద్యకళాశాల

బ్లాక్‌ ఫంగస్‌ సోకిన అవయవాలను పూర్తిగా తొలగించిన అనంతరం రోగి కోలుకున్న తర్వాత సాధారణ రూపం తీసుకురావడంలో ప్లాస్టిక్‌ సర్జరీ పాత్ర కీలకం. ఉదాహరణకు కనుగుడ్డును తీసేస్తే ఆ గుంతను పూడ్చాలి. దవడ ఎముకను తొలగిస్తే తిరిగి నిర్మించాలి. ఫంగస్‌ తినేసిన కణజాలాన్ని మళ్లీ నిర్మించాలి. శరీరంలోని ఇతర ప్రదేశాల నుంచి కండరాన్ని, చర్మాన్ని తీసుకొచ్చి అతికించాల్సి ఉంటుంది.

ఇదీ చూడండి:

ప్రత్యేక హోదా: 'పదేపదే అడగడం తప్ప చేసేదేమీ లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.