కరోనా వైరస్... ప్రస్తుతం ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ మహమ్మారిని తరిమేయడానికి అన్ని దేశాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. కరోనా పేరు వినపడితేనే ప్రజలు ఆమడ దూరం పరిగెడుతుంటే... వియాత్నంలోని ఓ రెస్టారెంట్ మాత్రం కరోనా వైరస్ను వ్యాపారం పెంచుకునే అస్త్రంగా మార్చుకుంది. చూడటానికి అచ్చం వైరస్ను పోలి ఉన్న బర్గర్లను తయారు చేసింది.
హనోయ్ నగరంలోని ఉన్న ఆ రెస్టారెంట్ ప్రత్యేకంగా వీటిని తయారు చేస్తోంది. పాలకూర ఫ్లేవర్తో కరోనా ఆకృతిలో తయారుచేసిన బర్గర్లను బుధవారం నుంచి విక్రయించడం ప్రారంభించింది. ఈ బర్గర్ను రుచి చూసేందుకు స్థానికులు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. తొలిరోజే 100 ఆర్డర్లు వచ్చాయి.
విసుగు చెందడమే కారణం
ప్రస్తతం ప్రపంచంలో ఏ నోట విన్నా, ఎటూ చూసినా అంతా కరోనానే. దీంతో విసుగు చెందిన ఆ రెస్టారెంట్ యజమాని కుమారుడు(10ఏళ్లు)... వైరస్పై వ్యంగ్యంగా ఏదైనా చేయాలని తన తండ్రిని కోరాడు. ఫలితంగా ఆ యజమాని కరోనా ఆకృతిలో బర్గర్ను తయారు చేశాడు.
వైరస్ ధాటికి దెబ్బతిన్న వ్యాపారం మళ్లీ కరోనా బర్గర్ కారణంగానే పుంజుకుంటుందని ఆశిస్తున్నాడు యజమాని.
ఇదీ చూడండి : కరోనా కాలంలో బర్త్ డే పార్టీ ఇలా చేసుకోవాలి...