రాష్ట్రంలోని ఇసుక తవ్వకాలు, వ్యాపారం గుప్పిట్లో పెట్టుకున్న 'టర్న్కీ' ఎంటర్ప్రైజ్ సంస్థ.. తమిళనాడులో ఇసుక మాఫియా డాన్గా పేరొందిన శేఖర్రెడ్డిదేనని తెలుగుదేశం ఆరోపించింది. ఆ సంస్థ డైరెక్టర్ బోసాని శ్రీనివాసరెడ్డి...శేఖర్రెడ్డికి వ్యాపార భాగస్వామి, అత్యంత సన్నిహితుడని ఆ పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దు సమయంలో శేఖర్రెడ్డికి సంబంధించిన వందల కోట్ల రూపాయల నోట్ల కట్టలు, బంగారాన్ని ఆదాయ పన్నుశాఖ స్వాధీనం చేసుకుందన్నారు. అప్పట్లో శ్రీనివాసరెడ్డి ఇంట్లోనూ సోదాలు జరిపి సొత్తు పట్టుకున్నారని వివరించారు. శ్రీనివాసరెడ్డి కన్నా ముందు 'టర్న్కీ' ఎంటర్ప్రైజ్ డైరెక్టర్గా వ్యవహరించిన తనూజ.. శేఖర్రెడ్డికి సమీప బంధువని ఆరోపించారు.
వేలకోట్ల దోపిడీ పథకంలో భాగంగానే జేపీ పవర్ వెంచర్స్, 'టర్న్కీ' ఎంటర్ప్రైజ్ సంస్థలను తెరపైకి తీసుకొచ్చారని పట్టాభి ఆరోపించారు. సబ్ కాంట్రాక్టు పేరిట శేఖర్రెడ్డి.. సీఎం జగన్ బినామీగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై మంత్రి పెద్దిరెడ్డి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
రీచ్లలో చెల్లింపు విధానంపై గనులశాఖ ఇన్ఛార్జ్ సంచాలకుడు చంద్రశేఖర్, మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలకు పొంతన లేదని పట్టాభి అన్నారు. ఆన్లైన్ ఇన్వాయిస్లు ఇచ్చే విధానాన్ని త్వరలో అమలు చేస్తామని గనులశాఖ ఇన్ఛార్జ్ చెబుతుంటే.. ఇప్పటికే ఆన్లైన్ ద్వారా చెల్లింపులు జరుగుతున్నాయని మంత్రి అంటున్నారని గుర్తుచేశారు. ఇద్దరి మాటల్లో ఎవరిది నిజమని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: విశ్వసేవిక ట్రస్టు .. ఓ వసుధైక కుటుంబం