వైకాపా పాలనలో నామినేషన్లు వెయ్యడమే పెద్ద సమస్యగా మారిపోయిందని. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ధ్వజమెత్తారు. పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందే అవకాశం ఉన్న తమ మద్దతుదారులపై తప్పుడు కేసులు బనాయిస్తూ అభ్యర్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. నెల్లూరు, తూర్పుగోదావరి జిల్లాలో తమ పార్టీ బలపరిచిన అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు బయల్దేరగా వారి వద్ద మద్యం లభించిందని తప్పుడు కేసులు పెట్టారని ఆక్షేపించారు.
ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తామని వైకాపా నేతలు చెబుతున్నారని, అలాంటపుడు ఈ పాట్లన్నీ ఎందుకని నిలదీశారు. తాము ఎస్పీలకు ఫోన్ చేస్తే వారు స్పందించడం లేదని, అందుకే ఇక్కడి పరిస్థితులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లామన్నారు. హోంంమంత్రి అమిత్షాతో కూడా మాట్లాడాలని కోరినట్లు వెల్లడించారు.
ఇదీచదవండి: అందితే జుట్టు.. అందకుంటే చేతులు