విజయవాడ నగరాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దే ప్రక్రియ మళ్లీ మొదలైంది. కరోనాకు ముందు కృష్ణా జిల్లా అంతటా ప్లాస్టిక్పై సమరాన్ని ఓ ఉద్యమంగా తీసుకెళ్లిన జిల్లా యంత్రాంగం... మరోసారి కార్యక్రమాన్ని పట్టాలెక్కించింది. ముందుగా విజయవాడలో ఏడు ప్రధాన కూడళ్లలో ప్లాస్టిక్ బాటిళ్ల రీసైక్లింగ్ స్టేషన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. వాటిని కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ ప్రారంభించారు.
ప్లాస్టిక్ బాటిళ్ల వినియోగం అనంతరం రీసైక్లింగ్ చేసేందుకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, పీడబ్యూడీ మైదానం, ఆర్టీసీ బస్టాండ్, కనకదుర్గమ్మ ఆలయం తదితర ప్రధాన కూడళ్లలో వీటిని ఏర్పాటు చేశారు. ఉపయోగించిన సీసాలను రీసైక్లింగ్ కియోస్క్లో వేసిన సమయంలో వినియోగదారుడు తన ఫోన్ నెంబరును నమోదు చేస్తే ఓ కూపన్ వస్తుంది. ఈ కూపన్ ద్వారా వివిధ వస్తువుల కొనుగోలు సమయంలో కొంత రాయితీ పొందే అవకాశం సైతం కల్పిస్తున్నారు.
ఈ కియోస్క్లో వేసే పెట్బాటిళ్లు పొడి రూపంలో మారుతాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, జీఎంఆర్ వంటి సంస్థల సహకారంతో ఏడు చోట్ల ఈ కియోస్కులు ఏర్పాటు చేసిన్నట్లు కలెక్టరు ఇంతియాజ్ అహ్మద్, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు.
ఇదీ చదవండి:
అధునాతన స్పోర్ట్స్ కాంప్లెక్స్లు, స్టార్ హోటళ్ల ఏర్పాటుకు నిర్ణయం