కరోనాతో ఎక్కువ మంది ప్రజలు చనిపోతే... నవరత్నాలు ఇచ్చే భారం తగ్గుతుందని సీఎం జగన్ భావిస్తున్నారని తెదేపా అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఆరోపించారు. కరోనా బారిన పడకుండా రమేశ్ కుమార్ ఎన్నికలు వాయిదా వేస్తే.... ఆయనపై జగన్ కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. రమేశ్ కుమార్ తొలగింపు ద్వారా ప్రజల ప్రాణాల పట్ల తనకు చిత్తశుద్ధి లేదన్నది సీఎం నిరూపించారని విమర్శించారు. ప్రజల ప్రాణాల కంటే ఎన్నికలే జగన్ కు ముఖ్యమైనట్లు తేటతెల్లమైందన్నారు. కరోనా వైరస్కు త్వరలోనే మందు కనిపెడతారేమో కానీ జగన్ మెదడులో ఉన్న ఫ్యాక్షన్ వైరస్కు మాత్రం మందు లేదని అనురాధ మండిపడ్డారు. కరోనా నివారణపై దృష్టి పెట్టకుండా పగలు, ప్రతీకారాలు, కక్షసాధింపులకే సీఎం ప్రాధాన్యం ఇస్తున్నారని ఆక్షేపించారు. మోహన్ దాస్ పాయ్ చెప్పినట్లు రాష్ట్రంలో రాజకీయ ఉగ్రవాదం నడుస్తోందని మండిపడ్డారు. రక్షణ పరికరాల అడిగిన వైద్యుల్ని సస్పెండ్ చేయటం ఉన్మాద చర్యని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి... కరోనాపై ఆందోళన వద్దు.. ఈ జాగ్రత్తలు పాటిస్తే చాలు!