కరోనా కారణంగా రోడ్ల మీదే ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితుల్లో జేటాక్స్ వసూళ్ల కోసం జగన్ పరితపిస్తుండటం దారుణమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. మద్యం దుకాణాలను రాత్రి 9 గంటల వరకూ తెరిచి ఉంచాలని ఆదేశాలు ఇవ్వడం దుర్మార్గమని మండిపడ్డారు. ఇప్పుడు అమ్మకాల సమయం పెంచడం కూడా మద్యపాన నిషేధంలో భాగమేనా అని.. నిలదీశారు. అకౌంట్స్ కోసం మరో గంట అదనం అంటూ మద్యం దుకాణాలు తెరవటం జగన్ మార్క్ డ్రామా అని విమర్శించారు.
మద్యపాన నిషేధం అంటూ మహిళల్ని మోసం చేశారని, ఇప్పుడు అమ్మకాల సమయం పెంచి రాష్ట్రంలో ప్రజల్ని చంపేస్తారా అని లోకేశ్ ప్రశ్నించారు. ఇక నుంచి కరోనా మరణాలు అన్నీ ప్రభుత్వ హత్యలుగానే పరిగణించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే మద్యం దుకాణాలు మూసివేయ్యాలని డిమాండ్ చేశారు. మద్యం దుకాణాల దగ్గర కుమ్ములాటలు, కనీస జాగ్రత్తలు కూడా లేకుండా జరుగుతున్న అమ్మకాల వలనే రాష్ట్రంలో కేసులు వేల సంఖ్యలో వస్తున్నాయని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: శిరోముండనం చేసిన యువకుడిని.. ఆ రోజు రాత్రి ఇలా కొట్టారా?