27నే ఆఖరి విమానం
రాజధాని అమరావతి నుంచి నేరుగా అంతర్జాతీయ స్థాయిలో రాకపోకల కోసం గత ప్రభుత్వం సింగపూర్కు విమాన సర్వీసు ప్రారంభించింది. 6 నెలల పాటు నడిపేందుకు ఇండిగో సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు 2018 డిసెంబర్ 4న సింగపూర్కు గన్నవరం విమానాశ్రయం నుంచి సర్వీసులు ప్రారంభమయ్యాయి. కృష్ణా , గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల వాసుల చిరకాల కోరికైన ఈ సర్వీసు ప్రారంభంతో ప్రజలు సంతోషపడ్డారు. మంగళ, గురు వారాల్లో ఈ సేవలు ఉండేవి. లాభదాయకంగా నడిచినా...సింగపూర్ సర్వీసులు నిలిపివేస్తున్నట్లు విమానాశ్రయ అధికారులకు, ఇండిగో సంస్థకు రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ నుంచి సమాచారం అందింది. ఈ నెల 27 గురువారం ఆఖరి విమానం సర్వీసు గన్నవరం నుంచి సింగపూర్కు వెళ్లింది.
అనుకున్నారు..రద్దు చేశారు
ఇండిగో సంస్థతో రాష్ట్రప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం ఈ నెలాఖరుతో ముగియడమే ఇందుకు కారణం. సర్వీసులు నడపాలంటూ 3రోజుల క్రితం అధికారుల నుంచి ఇండిగో సంస్థకు ఆదేశాలు వెళ్లాయి. మరో 6 నెలలు వీజీఎస్ పద్ధతిలో గడువు పొడిగించనున్నట్లు చెప్పడంతో వచ్చే నెల 9న నడిపే సర్వీసుకు టికెట్ల జారీని రెండు రోజుల క్రితం ఇండిగో ప్రారంభించింది. కొందరు ప్రయాణికులు టికెట్లు కొనేశారు. తాజాగా విమాన సర్వీసులు ఆపేయాలంటూ రాష్ట్ర విమానయాన అభివృద్ధి సంస్థ నుంచి ఇండిగో సంస్థకు ఆదేశాలు వెళ్లాయి. టికెట్లు తీసుకున్న ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది.
కథ మెుదటికే
సింగపూర్ విమాన సర్వీసుల కథ తిరిగి మొదటికొచ్చింది. సర్వీసులు ఆగిపోవడంతో ప్రయాణికులకు మళ్లీ అంతర్జాతీయ కష్టాలు వచ్చాయి. సర్వీసులను దుబాయ్ సహా మరికొన్ని దేశాలకు పెంచాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తుండగా... ఒక్కగానొక్క అంతర్జాతీయ సర్వీసు ఆగిపోయింది. పారిశ్రామిక, వాణిజ్య పరంగా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అన్నీ అనుమతులను తిరిగి కేంద్రం నుంచి తెచ్చుకోవాల్సి ఉంటుంది.