శ్రీనివాసుడు కొలువైన తిరుమల క్షేత్రానికి... దేశ, విదేశాల నుంచి యాత్రికులు వస్తుంటారు. నిత్యం వేలాది మంది సందర్శించే ప్రాంతం కావడం వల్ల... నిరంతర నిఘా అత్యావశ్యకం. భద్రతకు పెద్దపీట వేస్తున్న తితిదే... ఆక్టోపస్ దళం, పోలీసుల సిబ్బందికి తోడు అధునాతన పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటోంది. తిరుమల కొండను మూడు బోన్లుగా విభజించి... అలయం, మాఢ వీధులు, తిరుమల రహదారులతో పాటు పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసింది. మొత్తం 17 వందల కెమెరాలు ఉన్న ఈ వ్యవస్థపై... కమాండ్ కట్రోల్ రూమ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉంటుంది.
ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్తో అనుసంధానం
కొండపైనున్న 20 కెమెరాలను ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్తో అనుసంధానించారు. పాత నేరస్థులు, దళారులు, హైటెక్ యాచకులను... ఈ కెమెరాలు వెంటనే గుర్తుపట్టేసి సిబ్బందిని అప్రమత్తం చేస్తుంటాయి. దట్టమైన అటవీ ప్రాంతం కావడం వల్ల వన్యప్రాణులు, జంతువులు రోడ్లపైకి వచ్చినప్పుడు అప్రమత్తం చేసేలా... 'జోన్ ఇంట్రూషన్' సాఫ్ట్వేర్ కలిగిన 38 కెమెరాలు వినియోగిస్తున్నారు. అలాగే 'వెహికల్ కౌంట్ - నెంబర్ ప్లేట్ ఐడింటిఫికేషన్' సాయంతో... తిరుమలకు ఎన్ని వాహనాలు వస్తున్నాయి, వెళ్తున్నాయనే వివరాలు తెలుసుకుంటున్నారు. అగ్ని ప్రమాదాల సమాచారం చేరవేసేలా... ఆరు కెమెరాలకు 'ఫైర్ అండ్ స్మోక్ సాఫ్ట్వేర్' అనుసంధానించారు.
కరోనా నియంత్రణకు ప్రత్యేక సాఫ్ట్వేర్
కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు తితిదే భద్రతా సిబ్బంది ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యమైన ప్రాంతాల్లోని 8 కెమెరాలకు 'సోషల్ డిస్టెన్స్ సాఫ్ట్వేర్'ను జత చేసి పర్యవేక్షిస్తున్నారు. ఎవరైనా భౌతికదూరం నిబంధనలు అతిక్రమిస్తే... సిబ్బందికి సమాచారం చేరవేస్తుందీ సరికొత్త సాఫ్ట్వేర్. ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్న ఈ విధానాన్ని... పూర్తిస్థాయిలో వినియోగించేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే కమాండ్ కంట్రోల్ రూమ్ సిబ్బంది కూడా... భౌతికదూరం పాటించని వారి సమాచారాన్ని దగ్గర్లోని భద్రతా సిబ్బందికి అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు అధునాతన పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ, భద్రతా వ్యవస్థను పటిష్టంగా తీర్చిదిద్దుతున్నట్లు... తితిదే ముఖ్య నిఘా భద్రతాధికారి గోపీనాథ్ జెట్టి చెప్పారు.
ఇదీ చూడండి..
అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాం: మంత్రి పెద్దిరెడ్డి