ఇంటర్ తర్వాత ఇంజినీరింగ్, మెడిసిన్, అగ్రికల్చర్ చదువులే అన్న మునుపటి ధోరణి ఇప్పుడు లేదు. ఆయా కోర్సుల్లో నెలకొన్న పోటీ దృష్ట్యా విభిన్న చదువులకూ యువత ప్రాధాన్యమిస్తున్నారు. హోటల్ మేనేజ్మెంట్లో శిక్షణ పొందాక ఉద్యోగావకాశాలు మెరుగ్గా ఉండటం వల్ల.... ఇటువైపు అడుగేస్తున్నారు. తిరుపతిలో కేంద్ర, రాష్ట్ర పర్యాటకశాఖల ఆధ్వర్యంలోని స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ - S.I.H.M.లో వివిధ ప్రాంతాల విద్యార్థులు పాకశాస్త్ర ప్రావీణ్యులు అవుతున్నారు. జాతీయస్థాయి ఎన్సీహెచ్ఎమ్-జేఈఈ(NCHM-JEE) పరీక్ష ద్వారా మూడేళ్ల బీఎస్సీ(B.S.C.) డిగ్రీ కోర్సు.... రాష్ట్రస్థాయి పరీక్షల ద్వారా ఏడాదిన్నర క్రాఫ్ట్ కోర్స్, ఆరునెలల డిప్లొమా కోర్సులకు ప్రవేశాలు కల్పిస్తున్నారు. క్రాఫ్ట్, డిప్లొమా కోర్సులకు నూతన నోటిఫికేషన్ జూన్ 16న విడుదలైంది.
తిరుపతి ఎస్ఐహెచ్ఎమ్లో బీఎస్సీ కోర్సుకు 64, మిగతా రెండు కోర్సులకు 60 సీట్లు కేటాయించారు. క్రాఫ్ట్ కోర్సులకు పదో తరగతి, బీఎస్సీ కోర్సుకు ఇంటర్ విద్యార్హతగా నిర్ణయించారు. ఇనిస్టిట్యూట్లో కొన్నాళ్ల శిక్షణ తర్వాత ప్రముఖ ఫైవ్ స్టార్ హోటళ్లలోనూ ట్రైనింగ్ ఉంటుందని ఎస్ఐహెచ్ఎమ్ ప్రిన్సిపల్ చెబుతున్నారు.
పేద విద్యార్థులకు బ్యాంకు రుణాలు, ఉపకార వేతనాలు అందించేలా ఎస్ఐహెచ్ఎమ్ బాధ్యత తీసుకుంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. కొవిడ్ కాలంలోనూ దాదాపు అందరికీ ప్లేస్మెంట్స్ ఇప్పించామని అంటున్నారు.
ఇదీ చదవండి:
AP Jobs: జాబ్ క్యాలెండర్ విడుదల.. ఇకనుంచి ఇంటర్వ్యూలు లేవ్!