Somireddy: "కోర్టులో స్టే ఉన్న గ్రామనత్తం స్థలంలో రోడ్డు సమస్యపై అడిగేందుకు వచ్చిన మహిళ పట్ల అమానుషంగా ప్రవర్తిస్తారా? ప్రశ్నించిన సామాన్యులను తుపాకీ గురిపెట్టి బెదిరిస్తారా? దమ్ముంటే ఇప్పుడు రా.. ఎవరిని కాలుస్తారో కాల్చండి" అంటూ కలిగిరి సీఐ సాంబశివరావుపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ధ్వజమెత్తారు. అవినీతికి పాల్పడే అధికారులెవరినీ వదిలిపెట్టేదిలేదని.. న్యాయపోరాటం చేస్తామన్నారు. అవినీతికి పాల్పడే పోలీసు అధికారులను జాతీయ ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్ల ఎదుట నిలబెడతామన్నారు. పోలీస్ స్టేషన్లలో నమోదయ్యే కేసుల్లో 90శాతం తెదేపా వాళ్లపైనే ఉంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో అవినీతి, అక్రమాలకు, అరాచకాలకు పాల్పడుతున్న అధికారుల తీరుకు వ్యతిరేకంగా... ఏప్రిల్లో ఓ నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలిపారు.
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్రయాదవ్, మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావుతో కలిసి నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం వెలగపాడు పంచాయతీలోని పెదఅన్నలూరులో ఆదివారం సోమిరెడ్డి పర్యటించారు. వివాదానికి కారణమైన బాట సమస్యను పరిశీలించారు. బొలిగర్ల వెంకటసుబ్బమ్మను ఆమె ఇంటికెళ్లి పరామర్శించారు. తనకు జరిగిన అవమానాన్ని ఆమె వివరించారు. బాట సమస్యను అడిగేందుకు వెళితే సీఐ తుపాకీ గురిపెట్టి బెదిరించారని యువకులు వివరించారు. అనంతరం బొల్లినేని ఆధ్వర్యాన జరిగిన గౌరవ సభలో సోమిరెడ్డి, బీద రవిచంద్రయాదవ్ మాట్లాడారు.
సమస్య సృష్టించింది తెదేపానే: వైకాపా
Somireddy: మరోవైపు మహిళను పోలీసులు అవమానించారనేది అవాస్తవమని వైకాపా మండల కన్వీనర్ కాటం రవీంద్రారెడ్డి అన్నారు. లేని సమస్యను తెదేపా సృష్టించిందని ఆరోపించారు. సోమిరెడ్డి సహా తెదేపా నేతల ఆరోపణలను ఖండించారు. గ్రామంలో పంచాయతీ రోడ్డు వేయాలని ఇటీవల నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. సర్పంచి చెల్లెలైన వెంకట సుబ్బమ్మ బాటను అడ్డుకోవడంతో పోలీసు బందోబస్తు పంచాయతీ కార్యదర్శి... పోలీసులను కోరారని తెలిపారు. మహిళను అవమానించారన్నది అవాస్తవమని పేర్కొన్నారు.
ఇదీ చవదండి:
అప్పుడు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వస్తే.. పరిస్థితేంటి ?: మంత్రి అవంతి