నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల నీటి వినియోగంపై తెలుగురాష్ట్రాల్లో మరోసారి వివాదం నెలకొంది. సాగునీటి ప్రాజెక్టుల విధివిధానాలను ఉల్లంఘించి తెలంగాణ ప్రభుత్వం జలవిద్యుత్ ఉత్పత్తి ప్రారంభించింది. పులిచింతల ప్రాజెక్టుల వద్ద రెండు రోజుల నుంచి ఉత్పత్తి జరుగుతోంది. ఇవాళ నాగార్జునసాగర్ వద్ద కూడా విద్యుత్ ఉత్పత్రి ప్రారంభించారు. పులిచింతల ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా..ప్రస్తుతం 22 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ నుంచి 36 వేల క్యూసెక్కులకుపైగా నీరు వస్తోంది. జల విద్యుత్ కోసం నీటిని ఉపయోగించి దిగువకు వదిలేస్తున్నారు. కృష్ణాబోర్డు అనుమతి లేకుండా, తమకు కనీస సమాచారం ఇవ్వకుండా నీటిని విద్యుత్ ఉత్పత్తి కోసం మళ్లించటాన్ని ఏపీ ప్రభుత్వం తప్పుపడుతోంది. ఈ అంశంపై తెలంగాణ జెన్కో తో పాటు కృష్ణా బోర్డుకు కూడా లేఖ రాశారు. తాజాగా పులిచింతల ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి ఆపాలని తెలంగాణ జెన్కో ఎస్ఈ దేశ్యా నాయక్కు పులిచింతల ఎస్ఈ రమేశ్ బాబు వినతిపత్రం అందజేశారు. కృష్ణా డెల్టా అవసరాల కోసమే పులిచింతల ప్రాజెక్టు ఉందన్నారు. ఇంకా ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాలేదని తెలిపారు. ప్రస్తుతం కృష్ణాడెల్టాకు నీటి అవసరం లేదని స్పష్టం చేశారు. నీటిపారుదలశాఖ ఎస్ఈ నుంచి ఇండెంట్ లేదు కాబట్టి నీటి విడుదల ఆపేయాలని కోరారు.
నాగార్జున సాగర్ వద్ద కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంది. ప్రాజెక్టుకు ఇటువైపు ఏపీ, అటువైపు తెలంగాణ పోలీసులు మోహరించారు. తెలంగాణా ప్రభుత్వం సాగర్లో విద్యుత్ ఉత్పత్తికి అనుమతివ్వటాన్ని ఏపీ నీటిపారుదలశాఖ అధికారులు తప్పుబట్టారు. ప్రస్తుతం సాగర్లో 176.2 టీఎంసీల నిల్వ ఉంది. శ్రీశైలం నుంచి 31 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా.. అంతే మొత్తంలో దిగువకు వదులుతూ 8 యూనిట్ల ద్వారా 660 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తిపై అభ్యంతరాలు తెలిపేందుకు తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి వెళ్లాలని ఏపీ అధికారులు భావించారు. కృష్ణా బోర్డు అనుమతి లేకుండా నీటిని విద్యుత్ ఉత్పత్తికి వినియోగించటం సరికాదన్నారు. తెలంగాణ అధికారులకు వినతిపత్రం అందించేందుకు జలవనరులశాఖ, పోలీసు అధికారులు బృందంగా వెళ్లగా...కొత్త వంతెన వద్ద తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. తెలంగాణ అధికారులను ఫోన్లో సంప్రదించగా.. ఏపీ అధికారుల్ని కలిసేందుకు విముఖత వ్యక్తం చేశారు. మెయిల్ లేదా ఫ్యాక్స్ ద్వారా పంపించాలని సూచించారు. తెలంగాణా అధికారుల వైఖరిపై ఏపీ అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు.
ఏపీ సరిహద్దు అయిన సాగర్ బ్రిడ్జి వద్ద వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. మరోవైపు.. సాగర్ దిగువన ఉన్న పులిచింతల జలాశయం వద్దా సూర్యాపేట జిల్లా పోలీసులతో పాటు ప్రత్యేక దళాలు భారీ భద్రతా ఏర్పాట్లు చేశాయి. జూరాల ప్రాజెక్టు వద్ద తెలంగాణ ప్రభుత్వం బందోబస్తు ఏర్పాటు చేసింది. భారీగా పోలీసుల గస్తీ కాస్తున్నారు. ఉద్యోగులు మినహా ఎవరినీ పవర్ హౌస్ లోకి పోలీసులు అనుమతించడం లేదు. ఇద్దరు డీఎస్పీలు, ఆరుగురు సీఐలు, 16 మంది ఎస్సైలు, 100 మంది ఎస్పీఎఫ్, గ్రేహౌండ్స్, రిజర్వు బలగాలు ప్రాజెక్టు వద్ద పహారా కాస్తున్నారు. జూరాల ఆనకట్టపై రాకపోకలను తెలంగాణ పోలీసులు నిలిపివేశారు.
తెలుగు రాష్ట్రాల జలవివాదంతో ఎప్పుడేం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. నల్గొండ ఎస్పీ రంగనాథ్, గుంటూరు గ్రామీణ ఎస్పీ విశాల్ గున్నీ ప్రాజెక్టుల వద్ద భద్రత చర్యలను పర్యవేక్షిస్తున్నారు. పరిస్థితి చేయి దాటకుండా ఉండేందుకే భద్రతను పెంచినట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు.
ఇదీచదవండి
AP-TS Water War: ఇటు పులిచింతల.. అటు సాగర్: జలజగడంతో భారీగా భద్రత పెంపు