న్యూ డెవలప్మెంట్ బ్యాంకు (ఎన్డీబీ) రుణంతో చేపట్టే రహదారుల పనులకు రెండో విడతగా రాయలసీమ నాలుగు జిల్లాలతోపాటు, ప్రకాశం జిల్లాకు పిలిచిన టెండర్లలో.. ఈసారి కూడా కడపలో రెండే బిడ్లు దాఖలయ్యాయి. అనంతపురం, ప్రకాశంలో నాలుగు, చిత్తూరు, కర్నూలులో మూడేసి సంస్థల చొప్పున టెండర్లు వేశాయి. ఈ అయిదు జిల్లాల పనులకు టెండర్ల దాఖలు గడువు బుధవారంతో ముగియగా, ఆర్అండ్బీ ఇంజినీర్లు గురువారం వీటి సాంకేతిక బిడ్లు తెరిచారు.
ఏ జిల్లాలో ఎలా..
* కర్నూలులో గతంలో బిడ్ వేసిన పులివెందులలోని ఓ నేత కుటుంబానికి చెందిన ఎన్ఎస్పీఆర్తో పాటు, ఈసారి బీవీఎస్ఆర్, ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ టెండర్లు దాఖలు చేశాయి.
* చిత్తూరులో గతంలో టెండర్ కోట్ చేసిన మంత్రి పెద్దిరెడ్డి కుటుంబానికి చెందిన పీఎల్ఆర్ సంస్థ ఈసారి కూడా బరిలో నిలవగా, ఇంకా కేఎన్ఆర్, రిత్విక్ కన్స్ట్రక్షన్స్ బిడ్లు వేశాయి.
* కడపలో గతంలో బిడ్ వేసిన లెకాన్తో పాటు, కేపీసీ అనే సంస్థ బరిలో నిలిచింది. ఈ జిల్లాలో గతంలో టెండరు వేసిన పీఎల్ఆర్ సంస్థ ఈసారి దూరంగా ఉంది.
* ప్రకాశంలో గతంలో టెండర్ కోట్ చేసిన చిత్తూరు జిల్లాలోని ఓ ఎమ్మెల్యేకి చెందిన జేఎన్సీ సంస్థ, ఎస్ఆర్కే ఈసారి కూడా టెండర్లు వేయగా, అదనంగా రామలింగం కన్స్ట్రక్షన్స్, బాబూజీ కన్స్ట్రక్షన్స్ బరిలో నిలిచాయి.
* అనంతపురంలో గతంలో బిడ్లు వేసిన కేసీవీఆర్, వృద్ధితోపాటు కొత్తగా కేఎన్ఆర్, సుధాకర్ ఇన్ఫ్రా సంస్థలు టెండర్లు కోట్ చేశాయి.
* తొలిసారి పిలిచిన టెండర్లలో అన్ని జిల్లాల్లో రెండేసి టెండర్లే వచ్చాయి.
ఇదీ చదవండి: నేడు ప్రారంభం కానున్న పన్నెండేళ్ల పండగ