రాష్ట్ర వ్యాప్తంగా వాహనాల్లో ఉపయోగించే హై స్పీడ్ డీజిల్లో.. బయో డీజిల్ను ఎంత శాతం మేర కలపాలన్న అంశంపై రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ ఎక్స్ అఫిషియో కార్యదర్శి కోన శశిధర్ నోటిఫికేషన్ జారీ చేశారు. రాష్ట్రంలో 2021 ఆర్థిక సంవత్సరానికి గాను.. ఈ ఉత్తర్వులు అమలులోకి రానున్నాయి. బయో డీజిల్ విక్రయం, నిల్వ, రవాణా వంటి అంశాలకు సంబంధించి వేర్వేరుగా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు తప్పనిసరి చేస్తున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణలోని దుకాణాల్లో బయో డీజిల్ కలిపిన హైస్పీడ్ డీజిల్ విక్రయాలు జరగనున్నాయి.
ప్రభుత్వ ఉత్తర్వులు
బయో డీజిల్ ఉత్పత్తి చేసే తయారీదారులు కూడా ఉత్పత్తి, సరఫరా, నిల్వ విక్రయం.. వంటి అంశాలపై జిల్లా కలెక్టర్ నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు తీసుకోవాల్సి ఉంటుంది. హైస్పీడ్ డీజిల్లో ఈ బయో డీజిల్ను ఎంతమేరకు కలిసి ఉందన్న అంశాన్ని.. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో ముద్రించి ప్రతి పెట్రోల్ బంక్లోనూ ప్రదర్శించాలని స్పష్టం చేసింది. నిర్దేశించిన శాతం మేరకే బయోడీజిల్ను హైస్పీడ్ డీజిల్లో కలపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అదనంగా కలిపితే వాహన ఇంజన్లు దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
బయో డీజిల్ విక్రయాలకు సంబంధించి పూర్తి వివరాలను దుకాణాల్లో నమోదు చేయాలని తెలిపింది. ఈ నిబంధనలను కచ్చితంగా పాటించేలా.. చర్యలు తీసుకోవాలని క్షేత్ర స్థాయి అధికారులను ఆదేశించింది. అలాగే స్థానిక తాహసీల్దార్, పౌరసరఫరాల అధికారులు, మెట్రాలజీ అధికారులు తనిఖీలు నిర్వహించాలని సూచించింది.
ఇదీ చదవండి: