ప్రపంచవ్యాప్తంగా ఆధునిక ప్రజల జీవన విధానం, ఆహార అలవాట్లు మారుతున్నాయి. సంప్రదాయ ఆహారపదార్ధాల స్థానంలో ఫాస్ట్ ఫుడ్కు ప్రాధాన్యం పెరుగుతోంది. ఫలితంగా శరీరం అనేక అనారోగ్యాలకు కేంద్రంగా మారుతోంది. అధికబరువు, మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధులతో యువత పోరాటం చేయాల్సివస్తోంది. ఈ సమస్యకు సహజసిద్ధ ఆకుకూరలు, కూరగాయలతో పరిష్కారం చూపుతోంది.. అమెరికాకు చెందిన క్రిస్టినా.
ఔషధాలుగా వేగన్ ఉత్పత్తులు
'ఫుల్లీ రా'...! అమెరికా కేంద్రంగా ప్రకృతి సిద్ధ ఆహార ఉత్పత్తుల్ని అందిస్తున్న వేగన్ సంస్థ. వేగన్స్ అంటే జీవహింసకు అవకాశం లేకుండా, సహజమైన ఆకు, కాయగూరల్ని ఆహారంగా తీసుకునేవారు. క్రిస్టినా ఆధ్వర్వంలో నడిచే ఈ సంస్థ.. గుడ్లు, పాల ఉత్పత్తులు, తేనెనూ వినియోగించకుండా జంతు ప్రేమికులకు అవసరమైన ఆహారపదార్థాల్ని అందిస్తోంది. క్రమశిక్షణతో కూడిన ఆహ్లాదకర జీవితాన్ని కోరుకునే వారికే కాకుండా అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి.. ఈ వేగన్ ఉత్పత్తులు చక్కని ఔషధాలుగా ఉపయోగపడుతున్నాయి.
రుచికరమైన వేగన్ వంటలు
'ఫుల్లీ రా' అనే య్యూటూబ్ ఛానెల్ ద్వారా వేగన్స్కు అవసరమైన తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, గింజలు, విత్తనాల సమాచారాన్ని క్రిస్టినా అందిస్తోంది. ముడి ఉత్పత్తుల్లో ఉండే ప్రోటీన్లు, విటమిన్లను కోల్పోకుండా.. ఆహారాన్ని రుచికరంగా మలిచేందుకు విలువైన సలహాలు ఇస్తోంది. మాంసాహారం, శాఖాహార పదార్థాలకు రుచిలో ఏమాత్రం తీసిపోని రీతిలో వేగన్ ఉత్పత్తుల్ని స్వయంగా రూపొందిస్తోంది.
ఆరోగ్యానికి చిరునామా
శరీరానికి అవసరమైన పోషకాల్ని అందిస్తూనే... అన్నిరకాల రుచుల్ని పరిచయం చేస్తోంది క్రిస్టినా. చిన్నారులు, యువత ఇష్టపడే ఐస్క్రీంలనూ సహజసిద్ధ పండ్లు, కూరగాయలతో తయారుచేసి అందిస్తోంది. వేగన్స్ కోసం ఆకుకూరలు, కూరగాయలతోనే ఆరోగ్యాన్ని పెంచే రుచికర జ్యూస్ అందుబాటులోకి తెచ్చింది. అనేక రోగాల నుంచి రక్షణ కల్పిస్తూనే, రుచికీ చిరునామాగా మారిన 'ఫుల్లీ రా' కు.. యువత నుంచి చక్కని ఆదరణ లభిస్తోంది. ఉత్తమమైన వేగన్ ఉత్పత్తుల సమాచారం అందిస్తున్న ఈ సంస్థ... అమెరికాలో తొలిస్థానంలో కొనసాగుతోంది.
లక్షల మందిని వేగన్స్గా మార్చింది
ప్రపంచవ్యాప్తంగా యువతను పరిపూర్ణ శాఖాహరులుగా మారుస్తున్న క్రిస్టినా... చిన్నతనంలో మాంసాహారే. ఆమె తల్లి లెబనీస్, తండ్రి ఈక్వెడారియన్ కాగా.. ఇరుదేశాలకు చెందిన రుచికరమైన మాంసాహారాల్ని అమితంగా ఆరగించేది. ఫాస్ట్ఫుడ్ సైతం ఇష్టంగా తీసుకునేది. 16 ఏళ్ల ప్రాయంలో హైపర్ గైసీమియా వ్యాధి బారిన పడింది. ఆసుపత్రి పాలై బరువు కోల్పోయింది. అప్పుడే ఆరోగ్యంపై దృష్టి పెట్టింది. మార్కెట్లో ఓ వ్యక్తి ద్వారా వేగన్ ఉత్పత్తుల గురించి తెలుసుకుని అటుగా మారింది. నాటి నుంచి నేటి వరకు లక్షలాది మందిని వేగన్స్గా మార్చింది.. మారుస్తోంది.
ప్రకృతి ఒడిలో విహారం
ఆధునిక ప్రపంచాన్ని సవాలు చేస్తున్న వాతావరణ కాలుష్యం, జీవవైవిధ్యం, అనారోగ్య సమస్యలకు.. 'ఫుల్లీ రా' తో పరిష్కారం చూపేందుకు క్రిస్టినా ప్రయత్నిస్తోంది. మాంసాహార నియంత్రణ ద్వారా జీవ వైవిధ్య సమతుల్యాన్ని రక్షిస్తోంది. భావి తరాలకు అత్యుత్తమ భవిష్యత్తును అందించేందుకు కృషి చేస్తోంది. కేవలం ఆహార పద్ధతులకే పరిమితం కాక ఆరోగాన్ని, ఆహ్లాదాన్ని పంచే యోగా, పర్యాటకంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ప్రకృతి ఒడిలో తాను విహరించడమే కాకుండా.. ఔత్సాహిక యువత ఆ ఆనందాన్ని సొంతం చేసుకునేందుకు సాయం చేస్తోంది.
ఇదీ చదవండి:
తాడిపత్రిలో ఉద్రిక్తత... జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై వైకాపా కార్యకర్తల రాళ్ల దాడి...