కరోనా కలకలం రోజు రోజుకీ పెరుగుతోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 13కి చేరాయి. బుధవారం ఒక్కరోజే ఎనిమిది కోవిడ్-19 పాజిటివ్ కేసులు వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. బుధవారం ఎనిమిది మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణయ్యింది. ఇండోనేషియా నుంచి వచ్చిన ఓ వ్యక్తికి నిన్న కరోనా పాజిటివ్ రాగా.. అతనితో పాటు వచ్చిన తొమ్మిది మందిలో ఏడుగురికి కరోనా నిర్థారణ అయినట్టు వైద్యులు ప్రకటించారు. వారు పర్యటించిన ప్రదేశాలు సహా... ఎవరెవర్ని కలిశారన్న విషయాలపై వైద్య ఆరోగ్య శాఖ ఆరా తీస్తోంది.
ఇండోనేషియా నుంచి..
స్కాట్ ల్యాండ్ నుంచి వచ్చిన 22 ఏళ్ల యువకుడికి నిన్న కరోనా పాజిటివ్ రాగా... మరో 7కి కూడా కరోనా నిర్ధారణ అయినట్టు ప్రభుత్వం ప్రకటించింది. వీరింతా కూడా ఈనెల 14న ఇండోనేషియా నుంచి కరీంనగర్కి వచ్చినట్టు తెలుస్తోంది. ఇండోనేషియా నుంచి దిల్లీకి విమానం ద్వారా.. అక్కడి నుంచి హైదరాబాద్కి రైలు ప్రయాణం చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. వీరంతా కరీంనగర్ సమీపంలో ఓ మతపరమైన కార్యక్రమంలో పాల్గొనట్టు సమాచారం.
ఒకరి నుంచి ఏడుగురికి..
అనంతరం బృందంలోని ఒకరికి కరోనా లక్షణాలు కనిపించగా.. స్థానిక ఆస్పత్రికి వెళ్లారు. అక్కడి వైద్యులు గాంధీకి పంపించారు. 50 సంవత్సరాలకుపైగా ఉన్న ఆ వ్యక్తికి ఈ నెల 16న కరోనా ఉన్నట్టు నిర్ధారించిన వైద్యులు.... గాంధీలోనే చికిత్స అందిస్తున్నారు. అతడితోపాటు ఉన్న మిగతా కూడా ఐసోలేషన్లో ఉంచి పరీక్షలు నిర్వహించగా.. ఏడుగురికి వైరస్ సోకినట్లు తెలింది.
అత్యవసర సమావేశం..
వరుస పాజిటివ్ కేసులతో అప్రమత్తమైన సర్కారు.... తక్షణ చర్యలకు ఉపక్రమించింది. అర్థరాత్రి వరకు మంత్రి ఈటల కోఠిలోని కమాండ్ కంట్రోల్ రూమ్లో.. వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. కరోనా కట్టడికి ఇప్పటి వరకు తీసుకున్న చర్యలతో పాటు.. భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయాలపై చర్చించారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ప్రజలను మరింత అప్రమత్తం చేయడమే కాకుండా.. సమూహాలను కట్టడి చేసే దిశగా చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం.
నేడు తెలంగాణ సీఎం అత్యున్నత స్థాయి సమావేశం..
కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ వివిధ శాఖలు తీసుకుంటున్న చర్యలు... భవిష్యత్తు కార్యాచరణపై చర్చించే అవకాశం ఉంది.