ఏపీ డెవలప్మెంట్ కార్పొరేషన్ యాక్ట్ 2020 సెక్షన్ 12ను సవాల్ చేస్తూ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిపింది. ఎక్సైజ్ టాక్స్ను ఏపీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు తరలించేందుకు అవకాశం కల్పించే సెక్షన్ 12 రాజ్యాంగ విరుద్ధమని.. పిటిషనర్ తరఫు న్యాయవాది యలమంజుల బాలాజీ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. కార్పొరేషన్కు అప్పు చెల్లించే స్తోమత లేకపోయినా ప్రభుత్వం ఆస్తులివ్వటం.. ప్రజల జీవించే హక్కుకి విరుద్ధమని న్యాయవాది తెలిపారు.
మరోవైపు.. పిటిషనర్ అభ్యంతరాలను అంగీకరిస్తే కార్పొరేషన్ కు వచ్చే అప్పులు ఆగిపోతాయని ప్రభుత్వం తరఫు న్యాయవాది, సుప్రీం కోర్టు లాయర్ దుష్యంత్ దవే చెప్పారు. ఈ విషయమై కౌంటర్ దాఖలు చేస్తామన్నారు. ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాలని కోరారు. నగదును కన్సాలిడేటెట్ ఫండ్ లో వేస్తామని చెప్పారు. ఈ వ్యవహారానికి సంబంధించి.. ఇరు పక్షాల న్యాయవాదులు.. గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులను ఉదహరించారు.
ఇరువురి వాదనలు పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం.. ఆ జడ్జిమెంట్ ప్రతులను తమ ముందుకు తీసుకురావాలని న్యాయవాదులను ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.
అసలేం జరిగింది!
విశాఖ భూములను.. ఏపీ రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ పేరిట బదిలీ చేసి 25 వేల కోట్ల రుణాన్ని పొందాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. ప్రభుత్వ ఆస్తులను ఏపీఎస్టీసీ (APSDC)కి బదిలీ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని తక్షణం నిలువరిస్తూ ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
ప్రభుత్వానికి పన్నుల రూపంలో వచ్చిన సొమ్మును నేరుగా ఏపీఎస్టీసీకి అప్పగించేందుకు వీలు కలిగిస్తున్న చట్టాలను రద్దు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని కన్సాలిడేటెడ్ ఫండ్లో జమచేయకుండా ఏపీఎస్టీసీకి ధారాదత్తం చేయడానికి వీల్లేదన్నారు. ఈ వ్యాజ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఏపీఎస్టీసీ (APSDC) చైర్మన్, విశాఖ జిల్లా కలెక్టర్ను ప్రతివాదులుగా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రుణం తీసుకునేందుకు ఈ తరహాలో ఆస్తులను ఏపీఎస్టీసీ కి ఉచితంగా భూములను బదలాయించడం అధికరణ 219ని ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:
water disputes: 'ప్రాజెక్టుల వద్ద కేంద్ర బలగాలతో.. భద్రత ఏర్పాటు చేయండి'