స్థానిక సంస్థల ఎన్నికల్లో దౌర్జన్యాలతో బలవంతపు ఏకగ్రీవాలు జరుగకుండా రాష్ట్ర గవర్నర్ చొరవతీసుకోవాలని తాము కోరినట్లు భాజపా, జనసేన నేతలు తెలిపారు. మూడు అంశాలపై గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్కు వేర్వేరుగా వినతిపత్రాలు అందజేశారు. విజయవాడ రాజ్భవన్లో ఉదయం 11.30గంటలకు భాజపా, జనసేన ప్రతినిధుల బృందం గవర్నర్తో సమావేశమైంది. భాజపా తరపున పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు, మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ, మధుకర్, జనసేన తరుపున ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల ఇంఛార్జి నాదెండ్ల మనోహర్, పార్టీ కార్యదర్శి కందుల దుర్గేష్ తదితరులు గవర్నర్ను కలిశారు.
బెదిరింపులకు పాల్పడుతున్నారు..
అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో ఆన్లైన్ విధానంలో నామినేషన్లు స్వీకరించేలా ఆదేశించాలని గవర్నర్ను కోరామని నేతలు అన్నారు. వైకాపా ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను ఉపయోగించుకుని బెదిరింపులకు పాల్పడుతోందని.. దీనికి సంబంధించిన ఆధారాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. న్యాయబద్ధంగా, నిష్పాక్షికంగా ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేలా సహకరించాలని కోరినట్లు నేతలు తెలిపారు.
బలవంతపు ఏకగ్రీవాలు ఉపేక్షించబోం..
తమ రెండు పార్టీలు ఏకగ్రీవ ఎన్నికలను ఆహ్వానిస్తున్నాయని.. అయితే బలవంతపు ఏకగ్రీవాలను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. అధికార పార్టీ అహంకారంతో చేసే చర్యలను తిప్పికొడతామన్నారు. గత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల సమయంలో జరిగిన హింసాత్మక ఘటనలు ఈసారి పునరావృతం కాకుండా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర గవర్నర్ ఆ దిశగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశామన్నారు.
ఆలయాల మీద దాడులపైనా..
తుపాను సమయంలో నష్టపోయిన రైతులకు ఇప్పటికీ పరిహారం అందలేదని గవర్నర్కు భాజపా, జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. ఆలయాలపై జరుగుతున్న దాడులను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని నేతలు అన్నారు. మత మార్పిడులను ప్రోత్సహించేలా ప్రభుత్వం చేస్తున్న చర్యలపై ముఖ్యమంత్రిని పిలిపించి సమాధానం రాబట్టాలని గవర్నర్ను కోరామని భాజపా, జనసేన నేతలు తెలిపారు.
ఇదీ చదవండి:
వాలంటీర్లు వద్దు.. వారిని పంచాయతీ ఎన్నికలకు దూరంగా పెట్టండి: ఎస్ఈసీ