తెలంగాణ రాాష్ట్రంలోని భాగ్యనగరంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరగడానికి కారణం.. చాలామంది కొవిడ్-19ను స్వయంగా ఆహ్వానించడమేనని వైద్యులు చెప్తున్నారు. శనివారం మాదన్నపేటలోని ఓ అపార్ట్మెంట్లో సామూహికంగా కరోనా నిర్ధారణ అయింది. నిబంధనలు ఉల్లంఘించి కొంతమంది కలిసి పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం వల్ల వైరస్ ఒకరి నుంచి ఒకరికి సోకింది.
మంగళ్హాట్లో శుక్రవారం ఒకే భవనంలో ఉంటున్న 15 మందికి కొవిడ్ సోకింది. ఈ భవనంలో ఉంటున్న కుటుంబాలందరికీ కలిపి ఒకటే బాత్రూం ఉండటం ఇందుకు కారణం. అందరికీ ఒకే బాత్రూం ప్రమాదకరమని తెలిసినా వారికి వేరే దారి లేదు. మలక్పేట గంజ్లో తొలుత ఒక వ్యాపారికి కరోనా సోకగా అతని నుంచి కుటుంబంలోని 20 మందికి వ్యాపించింది. మరో 160 మంది క్వారంటైన్లో ఉన్నారు. ఇప్పటికే ఆ కుటుంబంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు.
వంద కేసులకు చేరువలో జియాగూడ...
అన్నింటికంటే జియాగూడ డివిజన్ పెద్ద ఉదాహరణ. ప్రస్తుతం ఇక్కడ కేసుల సంఖ్య వందకు చేరువలో ఉంది. దాదాపు 15 కుటుంబాలు ఈ వైరస్ బారిన పడ్డాయి. తమకు ఏమీ కాలేదని ఎవరికి వారు అనుకోవడం వల్లే ముప్పు పెరుగుతోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కంటెయిన్మెంట్ జోన్లలోనివారు సూచనలను పాటించకపోవడమే కొంప ముంచుతోంది. జోన్ను దాటుకొని బయటకు రావడం వల్ల కొత్త ప్రాంతాలకు వైరస్ సులువుగా వ్యాపిస్తోంది. బయటకు వెళ్లేవారు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఇంట్లోకి వైరస్ను ఆహ్వానిస్తూ కుటుంబ సభ్యులకు ముప్పు తెచ్చి పెడుతున్నారు.